Tuesday, September 27, 2011

ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరు

  • సిఐటియు సభల్లో జూలకంటి, శర్మ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, శాసనమండలిలో పిడిఎఫ్‌ నేత ఎంవిఎస్‌ శర్మ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సిఐటియు తొమ్మిదో జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం నిర్వహించిన భారీ ప్రదర్శన, బహిరంగ సభల్లో వారు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.రాజారామ్మోహన్‌రారు అధ్యక్షతన జరిగిన సభలో జూలకంటి మాట్లాడుతూ '2జి' కుంభకోణంలో ప్రధాని, హోంమంత్రి పేర్లు విన్పిస్తున్నాయనీ, దేశాన్ని కాపాడాల్సిన వారే కుంభకోణాల్లో ఉంటే ఇక ప్రజాసమస్యలు పరిష్కరించేదెవరనీ ప్రశ్నించారు. యుపిఎ-2, రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చేముందు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించాయనీ, అధికారం చేపట్టాక ఏ ఒక్కటీ అమలు చేయడం లేదనీ విమర్శించారు. యుపిఎ-1 ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో నడవడంతో కేంద్రం ప్రజలపై భారాలు వేసే సాహసం చేయలేదనీ, ప్రస్తుతం పదేపదే భారాలు మోపుతూ అన్ని వర్గాలనూ దివాళా తీయించే విధానాలు అమలు చేస్తోందనీ అన్నారు. ఉన్న ఉద్యోగులకు జిఓ మూడు ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలనీ కోరుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు.
బియ్యానికి 40 కోట్లయితే వ్యాట్‌ వల్ల 4 వేల కోట్ల ఆదాయం
ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.40 కోట్ల చొప్పున ఏడాదికి రూ.480 కోట్ల అదనపు భారం పడుతుందనీ, ఇదే సమయంలో ఇటీవల నిత్యావసరాలపై విధించిన వ్యాట్‌ వల్ల నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరిందనీ తెలిపారు. తాజాగా పెంచిన పెట్రోల్‌ ధరల వల్లే రాష్ట్ర ఖజానాకు రూ.వెయ్యి కోట్ల అదనపు ఆదాయం సమకూరిందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3.50 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జిఓ మూడు ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్‌ చేయాలనీ డిమాండ్‌ చేశారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేసేందుకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు సిద్ధంగా ఉన్నారనీ తెలిపారు. సిఐటియు నాయకులు బేబీరాణి మాట్లాడుతూ తణుకులో నిర్వహిస్తున్న సిఐటియు మహాసభలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు. ఇటీవల ప్రణాళికాసంఘం రోజుకు రూ.26 ఖర్చు చేసిన వ్యక్తి పేదవాడు కాదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తొలుత స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు.

ప్రజల జీవితాలతో ఆటలా?

  •  
  • ప్రణాళికా సంఘంపై బృందాకరత్‌ ఆగ్రహం
ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని భారత ప్రణాళికా సంఘం అంకెలతోనే కాక ప్రజల జీవితాలతో కూడా ఆటలాడుకుంటోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 32 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 రూపాయలు ఖర్చు పెడితే వారు పేదలు కారని చెబుతూ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికకు ప్రామాణికత ఏమిటని ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు. ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న ధరల్లో 26 రూపాయలతో ఒక వ్యక్తికి ఒకపూట భోజనం కూడా లభించని దుస్థితి నెలకొని ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు. ఒక వ్యక్తి పనిచేయాలంటే 2,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ స్థిరీకరించిన ప్రమాణాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌ జిల్లాలో కరువు ప్రభావంతో చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఆదివాసీలు రెండు లేదా మూడు రోజులకోసారి ఒక్కపూట మాత్రమే భోజనం చేసి కాలం గడిపేవారని అనేక నివేదికలు వెల్లడించినట్లు ఆమె పేర్కొన్నారు. మన దేశంలో ఆకలి స్థాయి ఇలా ఉంటే ప్రణాళికా సంఘం మాత్రం దేశవ్యాప్తంగా తన కాకిలెక్కలను రు ద్దుతూ మీరు, మీ పిల్లలు ఒక్కపూట కన్నా ఎక్కువ తింటే మీరు పేదలు కారంటోందని ఆమె విమర్శి ంచారు. పేదరికపు అంచనాలు ప్రభుత్వ విధానాల రూప కల్పన, పర్య వేక్షణకు విస్త్తృత స్థాయి సూచి కలుగా పనికోస్తా యన్నారు.

90వ దశకంలో ప్రజా వ్యతిరేక నయా ఆర్థిక సంస్కరణ విధానాలు అమలులోకి వచ్చే వరకూ అప్పటి ప్రభుత్వాలు ఈ విధానాన్నే అనుసరించినట్లు గుర్తు చేశారు. దేశంలో పేదలను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కుటుంబాల స్థాయిలో లెక్కలు అవసరమని, అయితే దేశంలో పెరిగిపోతున్న పేదరిక నిర్మూలనా పథకాల ఫలితాలను అధికారికంగా గుర్తించిన పేదలకు మాత్రమే పరిమితం చెయ్యాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆహార సబ్సిడీలు, ఆరోగ్యం, గృహనిర్మాణం, బ్యాంకు రుణాలు, పెన్షన్లు, బాలబాలికలకు సహాయం వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాలు ఇందుకు లక్ష్యంగా మారుతున్నాయని అన్నారు. పేదరికాన్ని అంచనా వేసి, పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రధానమన్న విషయాన్ని ఈ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని ఆమె వివరించారు. అయితే ఈ విధానాలను పక్కనబెట్టి అందుకు బదులుగా పారదర్శకత లేని ఏకపక్ష, మోసపూరిత విధానాలను ప్రణాళికా సంఘం అమలు చేస్తూ పేదరికపు అంచనాలపై కాకిలెక్కలు వేస్తోందని ఆమె విమర్శించారు. గత దశాబ్ద కాలంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల పేదరికపు అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, తదితర వర్గాల నుంచి పదేపదే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయాన్ని గుర్తించాలని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలో పేదరికపు స్థాయిని వివిధ కమిటీలు 27 శాతం నుంచి 77 శాతం వరకూ అంచనా వేసినట్లు ఆమె గుర్తు చేశారు. అందులో ప్రభుత్వం ఆమోదించిన టెండూల్కర్‌ కమిటీ అంచనాలు తప్పుడు తడకలని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు స్వతంత్రంగా పనిచేసే గ్రామీణాభివృద్ధి శాఖను ప్రణాళికా సంఘానికి అప్పగించారన్న బృందాకరత్‌ రూ.11 వేల వార్షిక ఆదాయ పరిమితితో 1992లో తొలిసారిగా పేదరిక అంచనాల సర్వేను నిర్వహించారన్నారు.దేశంలో 52 శాతం మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారంటూ అప్పట్లో వేసిన అంచనాలను ప్రణాళికా సంఘం తిరస్కరించిందని, అప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామంటూ యుపిఎ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఆహార భద్రతా చట్టం ప్రణాళికా సంఘం పెడుతున్న పరిమితులను చట్టబద్ధం చేయడానికి మాత్రమే పనికొస్తుందని బృందాకరత్‌ ఎద్దేవా చేశారు. ప్రణాళికా సంఘం కాకిలెక్కలను పక్కనబెట్టి చట్టబద్ధమైన ప్రజల డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు కేసు ఒక అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ఆ డిమాండ్‌ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ విస్తరణ కోసం పోరాటంగా మాత్రమే కాక ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, గృహనివాసం, తదితర కనీస అవసరాలను హక్కుగా కల్పించేందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు పన్ను మినహాయింపుల రూపంలో కోట్లాది రూపాయలను పందేరం చేసే ప్రభుత్వం తన ప్రాధాన్యతలను పునర్వ్యవస్థీకరించు కుంటే ఈ డిమాండ్‌ సాకారం అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

Sunday, September 11, 2011

రిలయన్స్‌పై చర్యలు

  • మాజీ డిజిహెచ్‌, ఇతర అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలి
  • నూతన అన్వేషణ అనుమతి విధానాన్ని పునఃసమీక్షించాలి
  • కెజి డి-6 ఉదంతంపై సిపిఎం డిమాండ్‌
   కెజి బేసిన్‌ విషయంలో కాగ్‌ నివేదిక ఆధారంగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిడెట్‌పై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డిమాండ్‌ చేసింది. భూ ఉపరితల, సముద్రాంతర్భాగ (ఆన్‌, ఆఫ్‌షోర్‌) చమురు, సహజవాయు అన్వేషణ కాంట్రాక్ట్‌లకు సంబంధించి కాగ్‌ ఇటీవల వెలువరించిన నివేదిక... ప్రభుత్వ పెద్దలు బడా వ్యాపారులు, వ్యాపార సంస్థలతో కుమ్మక్కయిన తీరును మరోసారి వెలుగులోకి తెచ్చిందని సిపిఎం పేర్కొంది. ఈ వ్యవహారంలో మాజీ డిజిహెచ్‌, ఇతర అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలని, నూతన అన్వేషణ అనుమతి విధానాన్ని పున్ణసమీక్షించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. కెజి డి-6 బ్లాక్‌లో రిలయన్స్‌ పలు అవకతవకలకు పాల్పడడం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక వెల్లడించినట్లు సిపిఎం తెలిపింది. ముఖ్యంగా పెట్రోలియం లాభాలలో సింహభాగాన్ని డిమాండ్‌ చేసేందుకు వీలుగా రిలయన్స్‌ గ్రూప్‌ పెట్టుబడి వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి చూపటం, రిలయన్స్‌ సంస్థ ఇతర ప్రైవేటు సంస్థలకు ఎటువంటి బిడ్డింగ్‌లు లేకుండానే కాంట్రాక్ట్‌లు అప్పగించటం పెట్టుబడి వ్యయం పెరగటానికి దారి తీసిందని కాగ్‌ నివేదిక వెల్లడించిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. కేటాయించిన మొత్తం 7,649 చ.కి.మీ అన్వేషిత ప్రాంతంలో కేవలం ఐదుశాతం తమ ఆధీనంలో ఉంచుకోవటానికి బదులు మొత్తం ప్రాంతాన్నే రిలయన్స్‌ తన ఆధీనంలో ఉంచుకోవటం... ఉత్పాదక పంపిణీ ఒప్పందం(పిఎస్‌సి)కి పూర్తి విరుద్ధమని తెలిపింది.

   ఈ బ్లాక్‌కు అంచనా వేసిన పెట్టుబడి వ్యయం 117 శాతం ఎక్కువగా పెరిగినా, ఉత్పాదక సామర్ధ్యంలో ఏ మాత్రమూ
పెంపుదల లేకపోవటాన్ని కాగ్‌ నివేదిక ఎత్తి చూపిందని తెలిపింది. కేవలం సింగిల్‌ ఫైనాన్షియల్‌ బిడ్ల ఆధారంగా భారీ కొనుగోళ్ల కాంట్రాక్టులను రిలయన్స్‌ దక్కించుకున్న విషయాన్ని కాగ్‌ నివేదిక వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేసింది. దీనివల్ల భారత ప్రభుత్వ పెట్టుబడుల రికవరీకి కూడా భారీగా గండిపడిందని తెలిపింది. 30 కోట్ల డాలర్ల అంచనా వ్యయం ఉన్న కాంట్రాక్ట్‌ను సింగిల్‌ ఫైనాన్షియల్‌ బిడ్‌ ద్వారా 110 కోట్ల డాలర్లకు పదేళ్లకు అకేర్‌ గ్రూప్‌కు కట్టబెట్టటమే ఇందుకు ఉదాహరణ అని, ఇటువంటి పది సింగిల్‌ పార్టీ బిడ్స్‌లో ఎనిమిది కాంట్రాక్ట్‌లను రిలయన్స్‌ గ్రూపు... అకేర్‌ గ్రూప్‌నకు కట్టబెట్టిందని తెలిపింది. దీనిని సాకుగా చూపి పెట్టుబడి వ్యయ అంచనాలను రిలయన్స్‌ గ్రూపు మూడు రెట్లకు పైగా పెంచేసి ఖజానాకు గండికొట్టే ప్రయత్నం చేసిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
కాగ్‌ నివేదికలో వెలుగు చూసిన మరో ప్రధానాంశం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డిజిహెచ్‌) పెట్రోలియం మంత్రిత్వశాఖలు రిలయన్స్‌తో కుమ్మక్కై మొత్తం అన్వేషిత ప్రాంతాన్ని డిస్కవరీ (నిక్షేపాలు కనుగొన్న) ప్రాంతంగా ప్రకటించటం. పిఎస్‌సి నిబంధనల ప్రకారం తొలి దశ అన్వేషణ పూర్తయిన వెంటనే రిలయన్స్‌ మొత్తం అన్వేషిత ప్రాంతంలో 25 శాతం ప్రాంతాన్ని, రెండో దశలో 50 శాతం ప్రాంతాన్ని, మూడో దశలో మొత్తం చమురు బావులను అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా రిలయన్స్‌ గ్రూపు ఈ ప్రాంతాల్లో ఏ మాత్రం ఖాళీ చేయకుండా తిష్టవేసుక్కూర్చుని మొత్తం ప్రాంతాన్ని తన ఆధీనంలో నే ఉంచుకున్నదని, ఇది పిఎస్‌సి నిబంధనలకు విరుద్ధమని పొలిట్‌బ్యూరో వివరించింది.

    భారతదేశం మొత్తం హైడ్రోకార్బన్‌ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేయటమే లక్ష్యంగా రూపొందిన కొత్త అన్వేషిత లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి) ముఖ్యోద్దేశం కాగా ప్రైవేటు సంస్థలు మొత్తం అన్వేషిత ప్రాంతాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకోవటంతో అది నీరుకారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బావుల నుండి ఉత్పత్తి పెరిగే కొద్దీ రాయల్టీలు పెరగాల్సి ఉండగా పెట్రో లాభాలు మాత్రం నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారయ్యాయని కాగ్‌ నివేదిక వెల్లడించిందని పొలిట్‌బ్యూరో వివరించింది. 2009-10లో రూ.5926 కోట్లు ఉన్న లాభాలు, 2010-11 నాటికి రూ.3,610 కోట్లకు పడిపోయిందని తెలిపింది. పిఎస్‌సి నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోనందున ఈ మొత్తం ఒప్పందాలను పున్ణసమీక్షించి సవరించాల్సిన అవసరం ఉందని పొలిట్‌బ్యూరో కేంద్రానికి సూచించింది. ఇదే విధంగా కెయిన్‌ ఎనర్జీ ఆధీనంలోని పన్నాముక్తా చమురు క్షేత్ర నిర్వహణలో కూడా లొసుగులు బయటపడటం ఎన్‌ఇఎల్‌పి అమలుతీరునే ప్రశ్నార్ధకంగా మారుస్తోందని అభిప్రాయపడింది. కాగ్‌ నివేదిక సూచించిన అంశాల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందానికి విరుద్ధంగా రిలయన్స్‌ తన అధీనంలో ఉంచుకున్న 95 శాతం అన్వేషణ ప్రాంతాన్ని సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవాలని, రిలయన్స్‌పై పెనాల్టీ విధించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మాజీ డిజిహెచ్‌తోపాటు ఈ ఉదంతంతో సంబంధమున్న ఇతర అధికారులను తక్షణమే ప్రాసిక్యూట్‌ చేయాలని, పెట్రోలియం మంత్రిత్వ శాఖ పాత్రనూ విచారించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఇలాంటి దుర్వినియోగాలను నివారించడానికి వీలుగా హైడ్రోకార్బన్‌ ఉత్పత్తి పంపిణీ ఒప్పందాల్లో మార్పులు తేవాలని, నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి)ని పున్ణసమీక్షించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

గిరిజనుల ప్రాణం నిలబెట్టే కృషి

ప్రభుత్వం తన బాధ్యత విస్మరించడంతో మానవత్వం ఉన్న దాతలు ఇచ్చిన సహకారంతో జన విజ్ఞానవేదిక, గిరిజన సంఘం మన్యం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనుల ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు అన్నారు. శనివారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం విశాఖ మన్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనుల ప్రాణాలను నిలబెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో 'కురు, కురు...' అంటూ 108 సేవల గురించి ప్రచారం చేసి ఓట్లు పొంది, ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. 104 దండగంటూ రూ.200 కోట్లు వృథా అయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి అనడాన్ని విమర్శిస్తూ ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. వీటిని సంస్కరించి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీని కేరళ పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఉపయోగపడే రీతిలో కాకుండా ప్రభుత్వాసుపత్రులు అభివృద్ధి చెందేలా ఆరోగ్యశ్రీని సమగ్ర పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. హెపటైటిస్‌-బి విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, విశాఖ మన్యంలో మలేరియాతో అనేక మంది మరణించారని చెప్పారు. డెంగ్యూ కూడా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ప్రబలుతోందన్నారు. దాతలు ఇచ్చిన మందులతో విశాఖ మన్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ సర్జికల్స్‌ అధినేత పి.రఘు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

మత హింస, మైనార్టీల పట్ల వివక్షకు తెరదించే చర్యలను పరిశీలించండి

  • ప్రభుత్వ విధానాల వల్లే యువతలో నిరాశా, నిస్పృహ
  • జాతీయ సమగ్రతా మండలిలో సిపిఎం
దేశంలో నానాటికి పెరిగిపోతున్న మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కులం, మతం ఆధారంగా యువతను వక్రమార్గం పట్టించటం వంటి అంశాలకు తెరదించే చర్యలను పరిశీలించాలని జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసి)కి సిపిఎం సూచించింది. ఈ మేరకు గురువారం ఇక్కడ జరిగిన మండలి సమావేశానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పలు సూచనలతో కూడిన పత్రాన్ని అందజేశారు. 2008 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌ఐసి భేటీ తరువాత మూడేళ్ల విరామం అనంతరం భేటీ అయిన ఎన్‌ఐసి జాతీయ సమగ్రత, మతోన్మాదం వంటి అంశాల పట్ల సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతోందని ఆ పత్రంలో పేర్కొన్నారు. మతోన్మాదం, పెరిగిపోతున్న మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కులం, మతం ఆధారంగా యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల వంటి అంశాలపై ఈ సమావేశంలోనైనా చర్చించి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. మతోన్మాదం సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలతో ముడపడి వున్నదన్న కరత్‌ మతోన్మాదం తగ్గిందని ఎవరైనా వాదిస్తే దానితో తాను ఏకీభవించబోనన్నారు. మతోన్మాదం తగ్గిందన్నా, పెరిగిందన్నా అందుకు ఆ ఏడాది కాలంలో జరిగిన ఘటనలను ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

2009లో మొత్తం 791 మతోన్మాద ఘటనలు జరగ్గా అందులో 119 మంది మరణించారని, 2,342 మందికి పైగా గాయాలపాలయ్యారని కరత్‌ వివరించారు. 2010లో 658 ఘటనలు జరిగి 111 మంది మరణించగా, క్షతగాత్రులైన వారి సంఖ్య 1,971గా నమోదయిందని ఇవి సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ అందచేసిన వివరాలేనని ఆయన తెలిపారు. 2005-09 మధ్య జరిగిన మతోన్మాద హింసాత్మక ఘటనల్లో ఏటా 130 మంది ప్రాణాలు కోల్పోగా 2,200 మందికి పైగా గాయాల పాలయ్యారని ఆయన గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఈ సంఖ్యలో ఒకటి, అరా తగ్గుదల ఉన్నప్పటికీ దీనితోనే సంతృప్తి చెందటానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మతోన్మాదం, మతోన్మాద రాజకీయ ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతుండటం జాతీయ సమైక్యతను దెబ్బతీయటమే కాక మన దేశ లౌకిక ఛత్రాన్ని ఛిద్రం చేస్తుందని కరత్‌ అభిప్రాయపడ్డారు. మతోన్మాదానికి మత ఛాందసవాదం, మతం రంగు పులుముకుంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలు ఆజ్యం పోస్తున్నాయన్నారు. మతోన్మాదం, మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరం వుందన్నారు. అయోధ్య అంశంపై 1992లో మొదలైన మతోన్మాద రాజకీయాల విపరిణామాలను అందరం చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయతా వాదం పేరిట జనం మధ్యలోకి వస్తున్న రాజకీయాలు మెజార్టీ మతోన్మాదం తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు.

మైనార్టీ మతోన్మాదం కూడా లౌకిక వాదానికి ప్రమాదకరమేనన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలున్నంత కాలం మతోన్మాదం కొనసాగుతూనే వుంటుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో మతోన్మాద సైద్ధాంతికతను ప్రవేశపెట్టేందుకు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన ఇటువంటి లౌకిక వ్యతిరేక మతోన్మాద సైద్ధాంతికతను కూకటి వేళ్లతో పెకలించివేయాల్సిన అవసరం వుందన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, మైనార్టీల పట్ల విషం కక్కటం వంటి చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
ఉగ్రవాదంపై...
భారత్‌లో ఉగ్రవాదం ప్రధానంగా మతపరమైన తీవ్రవాదం, మత విద్వేషాల నుండి పుట్టిందని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదులకు మతం లేదనటంతోనే సరిపోదని, మత తీవ్రవాదం, మతోన్మాదం ఉగ్రవాదానికి బీజాలు వేస్తున్నాయన్న సంగతిని మనం మరువరాదని అన్నారు. మన దేశంలో మతోన్మాదానికి ఉగ్రవాదానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో మత తీవ్రవాదం ఉగ్రవాద హింసకు ఆజ్యం పోస్తోందని ఇందుకు ప్రధానంగా కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు దోహదం చేస్తున్నాయని కరత్‌ వివరించారు. ముంబయి నగరంలో జులైనెలలో జరిగిన పేలుళ్లు, ఢిల్లీ హైకోర్టువద్ద పేలుళ్ల వంటి ఘటనల ద్వారా ఈ సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కరత్‌ తెలిపారు. ఈ సంఘటనల ఆధారంగా కేవలం ఏదో ఒక సెక్షన్‌కు ఉగ్రవాదాన్ని అంటగట్టి వారిని మత సమీకరణకు లక్ష్యంగా చేయటం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. మలేగావ్‌, మక్కా మసీదు, అజ్మీరే షరీఫ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఘటనల వెనుక కొన్ని హిందూత్వ తీవ్రవాద శక్తులున్నాయని దర్యాప్తులో తేలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మతోన్మాదాన్ని, మత తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడే ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా నిర్మూలించగలమని కరత్‌ పునరుద్ఘాటించారు.
మత హింస బిల్లుపై...
మత హింసను సమర్ధవంతంగా ఎదుర్కొని అందుకు పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు విధించే విధంగా పాలనాయంత్రాంగానికి విస్తృతాధికారాలనిచ్చే చట్టం అవసరమని కరత్‌ అభిప్రాయపడ్డారు. ఇటువంటి మతోన్మాద హింసకు బలైన బాధిత కుటుంబాలకు పరిహారాన్ని, పునరావాసాన్ని అందచేసే విధంగా ఈ చట్టం వుండాలన్నారు. మత హింస ఘటనలకు చెక్‌ పెట్టేందుకు పాలనాయంత్రాంగానికి, పోలీసులకు ఈ చట్టం ద్వారా జవాబుదారీ తనాన్ని కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఇది చేసేటప్పుడు రెండు విషయాలను దృష్టిలో వుంచుకోవాలని, ఈ చట్టం కేవలం మతపరమైన హింసపై మాత్రమే దృష్టి పెట్టాలి తప్ప ఇతర రకాలైన హింస, ఘర్షణలపై దృష్టి పెట్టరాదని, అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ, పోలిసింగ్‌ వంటి రాష్ట్రాల ప్రాథమిక బాధ్యతల అంశాల్లో ఈ చట్టం దేశ సమాఖ్య సూత్రాన్ని దృష్టిలో వుంచుకుని అమలు జరగాలని వక్కాణించారు.
మైనార్టీలపై వివక్ష
దేశంలోని మైనార్టీల్లో అధికశాతంగా వున్న ముస్లింలు తీవ్ర అణచివేతకు, వివక్షకు గురవుతున్నారని కరత్‌ తెలిపారు. సచార్‌ కమిటీ నివేదిక ఈ అంశాన్ని సమగ్రంగా వెలుగులోకి తెచ్చిందనీ విద్యా, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఫలాలను అందుకోలేనంత దూరంలో ముస్లిం సమాజం వెనుకబడి వుందని గుర్తు చేశారు. ఈ వెనుకబాటును తొలగించేందుకు సమాన హక్కుల కమిషన్‌ ఏర్పాటు వంటి సచార్‌ కమిటీ చేసిన సూచనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. సామాజికాభివృద్ధి, వ్యయంలో మైనార్టీలకు తగిన వాటా దక్కేందుకు ఉప ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరంపై సిపిఎం దీర్ఘకాలంగా ప్రభుత్వంతో వాదిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. షెడ్యూల్డు తెగలవారికి తీరని అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతోనే వారి ఉనికికి ముప్పు వాటిల్లుతోందని కరత్‌ తెలిపారు. ఇందుకు ఉదాహరణ ప్రభుత్వ మైనింగ్‌ విధానమేనన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైనింగ్‌ విధానం వల్ల భారీఎత్తున ఆదివాసీలు కూడు, గూడు కోల్పోయి నిర్వాసితులవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భూముల్లో కార్పొరేట్‌ సంస్థలకు మైనింగ్‌ హక్కులు కట్టుబెట్టటం ద్వారా ప్రభుత్వం ఆదివాసీల ప్రాథమిక హక్కులను, జీవనాధారాన్ని కాలరాస్తోందన్నారు.
పౌర ఘర్షణలు...
పౌర ఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం వలసకాలం నాటి చట్టాలనే ఉపయోగిస్తోందని గత ఏడాది జూన్‌లో కాశ్మీర్‌ లోయలో జరిగిన అల్లర్లు, అశాంతి పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని కరత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వేసవి కాలంలో దాదాపు 120 మంది యువకులు పోలీసులు, భద్రతా దళాల బుల్లెట్లకు బలయ్యారని వివరించారు. ఆగ్రహంతో రాళ్లు రువ్వే యువతను ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు వారిని కాల్చి చంపి మాయం చెయ్యాలన్న విధానాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఈ అమానుషమైన విధానానికి తీవ్రవాదం వంటి అశాంతిని ఎదుర్కొనే విధానాలే మూల కారణమన్నారు. ప్రజా ప్రదర్శనలను, పౌర అశాంతిని సరైన విధంగా ఎదుర్కొనేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందన్నారు. ప్రజా ప్రదర్శనలు, నిరసనల పట్ల పోలీసుల్లో పెరిగిపోతున్న అసహనాన్ని ఇటీవలి కాలంలో గమనిస్తున్నామని, రాజ్యాంగం ప్రసాదించిన సమావేశ హక్కు (రైట్‌ టు అసెంబ్లీ) పూర్తిగా కాలరాయబడిందని ఆయన గుర్తుచేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిషేధించేందుకు అధికార యంత్రాంగం, అప్పుడప్పుడూ కోర్టులు విధిస్తున్న నిషేధాజ్ఞల కారణంగా ప్రజాస్వామిక హక్కులు హరింపబడుతున్నాయన్నారు. ఇటీవలి కాలం లోఅవినీతికి వ్యతిరేకంగా జరిగిన శాంతియుత ప్రదర్శ నల ను సైతం పోలీసు బలగాలు ఏ విధంగా అణచివేశాయో మనందరం కళ్లారా చూశామని ఆయన గుర్తు చేశారు. ప్రజా స్వామిక హక్కులను కాలరాయటం, బహిరంగ ప్రదేశాల్లో శాంతి యుత నిరసనలను అడ్డుకోవటం వంటి చర్యలు సామాజిక అశాంతికి ఆజ్యం పోస్తాయని ఆయన హెచ్చరించారు.
యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు...
యువతను సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ఆధారంగా సానుకూల దిశలో మర్చాల్సి వుండగా వారిని మతం, కులం వంటి అంశాల ఆధారంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సామాజికాభివృద్ధికి, లౌకిక, మత సామరస్యానికి హాని చేస్తుందని ఆయన హెచ్చరించారు. యువత తీవ్రవాదం వైపు ఎందుకు మళ్లుతున్నారన్న అంశాన్ని మొదటిగా మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, యువత ప్రాథమిక అవసరాలు తీరకపోవటం వల్లే ఈ అశాంతి పెరుగుతోందని, యువత భవితకు నిరుద్యోగం పెను శాపంగా మారిందని ఆయన అన్నారు. జాతీయ నమూనా సర్వే లెక్కల ప్రకారం ఉపాధి అవకాశాల పెరుగుదల 2000-2005 మధ్య కాలం నాటి 2.7 శాతం నుండి 2005-10 మధ్య కాలానికి 0.8 శాతానికి పడిపోయిందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలపై కోత విధిస్తున్న ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకూ 10,81,336 ఉద్యోగాలు ఖాళీగా పడి వున్నాయన్నారు. ఉపాధి కల్పనలో ఏమీ చేయకుండా మార్కెట్‌ శక్తులే ఉద్యోగాలిస్తాయన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం లభించక నిరాశ, నిస్పృహలకు గురవుతున్న యువత మతోన్మాదం, ప్రాంతీయవాదం, కులం వంటి విభజన శక్తుల ఆకర్షణకు గురవుతున్నదన్నారు. దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక మార్పుల్లో యువతకు భాగస్వామ్యం కల్పించటం ఇప్పుడు పెనుసవాలుగా మారిందన్న కరత్‌ వారికి సరైన అవకాశాలు కల్పించి ఉత్పాదకతలో భాగస్వామ్యం కల్పించటం ద్వారా వారు తమ జీవితాలను సామాజిక న్యాయంతో, గౌరవంతో కొనసాగించగలరన్న విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, విధానాల్లో సమూలమైన మార్పులు రావాలని, ఇటువంటి మార్పులకు యువత తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని కరత్‌ స్పష్టం చేశారు.