- ఎగతాళి చేసిన వారే మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు
- సిపిఎం అనంతపురం మహాసభల్లో ఎంఎ గఫూర్
రానున్నది ప్రజాఉద్యమాల కాలమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ అన్నారు. అనంతపురం సిపిఎం జిల్లా కార్యాలయం (గణేనాయక్) గుత్తిరామకృష్ణ ప్రాంగణంలో 10వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సిపిఎం సీనియర్ నాయకులు శ్రీరాములు పతాకవిష్కరణ చేశారు. మహాసభలను గఫూర్ ప్రారంభిస్తూ కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని, పెట్టుబడిదారీ విధానమే సరైందంటూ ఎగతాళి చేసిన వారే నేడు మార్క్సిజాన్ని అధ్యయనం చేయక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ స్థిరం, శాశ్వతం కాదని మార్క్స్ చెప్పారనీ, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక సంక్షోభమే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని యుపిఎ-2 ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తమవుతోందన్నారు. రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. ఇది జరుగుతున్న క్రమంలోనే విద్య, వైద్యరంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా పాలనను కొనసాగించాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని స్థంభింప చేసే పరిస్థితి వస్తుందన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలకు కోత పెడుతూ ప్రజలపై భారీగా భారాలు మోపేందుకు సిద్ధపడుతోందని చెప్పారు. విభజన, సమైక్యవాదం పేరుతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైందన్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కష్టజీవులు, పేదల పక్షాన పోరాటాలకు సిపిఎం నాయకత్వం వహించేదిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాసభలకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్ హాజరయ్యారు. ఎం.ఇంతియాజ్, సావిత్రి, డి.శ్రీనివాస్, బిహెచ్.రాయుడు, సి.రామకృష్ణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.
No comments:
Post a Comment