Saturday, January 21, 2012

బూర్జువా పార్టీలవి అవకాశవాద రాజకీయాలు

 
బూర్జువా పార్టీలు అవకాశవాద రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని వివిధ అంశాలపై శుక్రవారం నిర్వహించిన సెమినార్లలో వక్తలు విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిరలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 'అవకాశవాద రాజకీయాలు- ప్రత్యామ్నాయం' అంశంపై జరిగిన సెమినార్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పంటలకు గిట్టుబాటు ధరలు 40 శాతానికి పడిపోయాయన్నారు. ఎరువుల, పురుగు మందుల, విత్తనాల ధరలను పెంచి వ్యవసాయాన్ని రైతులకు దూరం చేస్తున్నారన్నారు. ఈ విధానాల వల్ల పదేళ్లలో దేశంలో లక్షా పదివేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుకు రూ.22,400 సబ్సిడీ రూపంలో ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇదంతా ఎటు పోతోందని ప్రశ్నించారు. సబ్సిడీని నేరుగా రైతుకే ఇవ్వాలని కోరారు. చైనాలో పంటలు వేయకముందే గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని, ఆ విధంగా మనదేశంలోనూ చేస్తే ఉపయోగం ఉంటుందని అన్నారు. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంటు రాక గత ఏడాది 28 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. పార్టీ జిల్లా నాయకులు లింగాల కమల్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సుబ్బారావు, మధిర డివిజన్‌ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
చింతూరులో 'ప్రపంచీకరణ-గిరిజనులపై ప్రభావం' అంశంపై సెమినార్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు, విఆర్‌పురం, కూనవరం మండలాల్లో 'అవకాశవాద రాజకీయాలు-ప్రత్యామ్నాయాలు' అంశంపై వేర్వేరుగా జరిగిన సెమినార్లలో రాష్ట్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ మాట్లాడారు. కల్లూరులో 'ప్రపంచీకరణ -వివిధ తరగతులపై ప్రభావం' అంశంపై రాష్ట్ర కమిటీ సభ్యులు సామినేని రామారావు ప్రసంగించారు.

No comments:

Post a Comment