Saturday, January 21, 2012

ఉద్యమ నిర్మాతలు - మార్క్సిస్టు మేధావి మాకినేని


తన అపార అధ్యయనాన్ని అమోఘమైన మేధస్సును సామ్యవాద సమాజ సాధనకు, శ్రమ జీవుల విముక్తి సైద్ధాంతిక సత్యాన్వేషణకు వెచ్చించిన సాటిలేని ప్రజ్ఞాశాలి మాకినేని బసవపున్నయ్య.
మాకినేని భారత కమ్యూ నిస్టు ఉద్యమ చరిత్రలో ఒక విజ్ఞాన శిఖరం; ఒక సైద్ధాంతిక సర్వస్వం; ఒక రాజనీతి సంపుటం. ఆయన కలం, గళం పదునైనవి. ఎంబిగా సుప్రసిద్దుడైన బసవపున్నయ్య గుంటూరు జిల్లాలో 1914 డిసెంబరు 14 న జన్మించారు.గుంటూరు ఎసి కాలేజీలో బిఎ చదివారు.1930లో స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వ పద్దతులు నచ్చక 1934-35లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ సహాయ కార్యదర్శిగానూ, 1940లో విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగానూ ఎన్ని కయ్యారు. 1940లో పార్టీ గుంటూరు జిల్లా కార్య దర్శిగా, 1943లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికైనారు.1948లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైనారు.1950 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులుగా వున్నారు. వీరతెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నేతలలో ఆయన ఒకరు. ముఖ్యంగా దానికి అవసరమైన నిధులు, ఆయుధాలు సేకరించటంలో బసవపున్నయ్య పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది. ఆ పోరాటం కొనసాగించాలా లేదా అనే విషయమై తర్జన భర్జనలు జరిగినపుడు వాటిపై స్టాలిన్‌ సలహా తీసుకునేందుకు మాస్కో వెళ్లిన ప్రతినిధి వర్గంలో ఆయన ఒకరు. కమ్యూనిస్టుపార్టీ 1964లో సిపిఐ(ఎం)గా పునర్నిర్మాణమైనప్పుడు కీలకమైన విధాన పత్రాలన్నిటి రూపకల్పనలో ఆయన ప్రధానపాత్ర వహించారు.
రెండు మహా సోషలిస్టు దేశాలైన అప్పటి సోవియట్‌ యూనియన్‌ , చైనాలు రెండూ సిపిఐ(ఎం)తో విభేదించిన కాలంలో పార్టీ సైద్దాంతిక అవగాహనను, రాజకీయ ప్రతిష్టను పెంపొందించడంలో ఎంబి అనన్య సామాన్యమైన పాత్ర పోషించారు.
దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించడం అనే సూత్రాన్ని ఆయన సదా పాటించేవారు. స్టాలిన్‌తోనే గాక మావో, చౌఎన్‌లై తదితరులతో కూడా అనేకసార్లు చర్చలు జరిపారు. పార్టీ అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరించడంలో ఆయన కీలక పాత్ర నిర్వహిం చారు. నాటి సోవియట్‌ యూనియన్‌లో గోర్బచెవ్‌ నాయకత్వం శల్య సారధ్యం ప్రారం భించినట్టు స్పష్టం కాగానే ఆయన ఒక సమగ్ర సిద్దాంత పత్రం రాసి ప్రపంచం పరస్పరా ధారితమనే దివాళాకోరు వాదనలను తుత్తు నియలు చేశారు. మాకినేని వాదనా పటిమ, వ్యంగ్య వైభవం, హాస్యం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. సాహిత్యంలో ఆయనకు మంచి పట్టు వుండేది. తెలుగు సామెతలు, జాతీయాలను అలవోకగా ఉపయోగించే మాకినేని ఆంగ్ల భాషలోనూ అంత ధాటి కనపరచేవారు. జీవితం చివరి క్షణం వరకు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకుడిగా పని చేసిన మాకినేని అఖిల భారత ఉద్యమంతో పాటు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమానికి ధృవ తారగా వెలుగొందుతుంటారు.

No comments:

Post a Comment