Wednesday, August 17, 2011

ప్రజాస్వామ్య హక్కులపై దాడి

అన్నా అరెస్టుకు సిపిఎం ఖండన - నేడు దేశవ్యాప్త నిరసన
            అన్నాహజారే, ఆయన అనుచరుల అరెస్టును, ఢిల్లీలో నిరాహార దీక్షను నిషేధించడం ద్వారా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాతంత్ర హక్కుపై దాడి చేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ చర్యను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కులపై దాడిగా అభివర్ణించింది. ప్రజాతంత్ర హక్కులపై దాడిని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు జరపాల్సిందిగా సిపిఎం తన శాఖలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నతస్థాయి అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయి ఉండగా అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఎలాంటి పోరాటం పట్లనైనా కాంగ్రెస్‌ నాయకత్వ అసహన వైఖరిని ఈ చర్య తెలియజేస్తున్నట్లు సిపిఎం పేర్కొంది. ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అధికారిక లోక్‌పాల్‌ బిల్లు బలహీనమైందని, తగిన విధంగా లేదని పునరుద్ఘాటించింది. సమర్థవంతమైన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేలా ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉందని సిపిఎం ఆ ప్రకటనలో పేర్కొంది.

Tuesday, August 16, 2011

సిపిఎం ఆధ్వర్యంలో జమిందారు కబ్జా భూమిలో జెండాలు

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం గణపవరానికి చెందిన జమీందారు బొమ్మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆక్రమణలోని అసైన్డ్‌ భూములను పంచాలని వందలాదిమంది పేదలు సిపిఎం ఆధ్వర్యంలో ఆ భూముల్లో సోమవారం జెండాలు పాతారు. సిపిఎం మైలవరం డివిజన్‌, జి.కొండూరు మండల కమిటీల ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు ఎర్రజెండాలు చేబూని ఆర్‌ఎస్‌ నం.360లోని 17.86 ఎకరాల సీలింగ్‌ భూమిని ఆక్రమించారు. ఈ సందర్భంగా మైలవరం డివిజన్‌ కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ పేదలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే భూస్వాములు, జమీందార్ల ఆక్రమణలోని భూములను స్వాధీనం చేసుకోగలుగుతామని చెప్పారు. 1977లో జమీందారు బొమ్మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సీలింగ్‌ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటూ ఏటా లక్షలాది రూపాయలు గడిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ ఆనాటి నుంచి నేటి వరకూ పొందిన ఆదాయాన్ని రాబట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు ఎస్‌.వి.సారధి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి జమీందారు ఆధీనంలో అసైన్డ్‌ భూములున్నా అధికారులు స్వాధీనం చేసుకోకుండా మిన్నకుండడం బాధాకరమన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి చౌటపల్లి రవి, సిపిఎం జి.కొండూరు మండల కార్యదర్శి బూర్సు శివ పాల్గొన్నారు.

ఆర్థిక సంస్కరణలే అవినీతికి కారణం

  • సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ఆర్‌
20 ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల విష ఫలాల ఫలితమే అంతులేని అవినీతి అని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు అన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికె) ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నిరవధికంగా నడుస్తున్న స్టడీసర్కిల్‌ 200 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుందరయ్యభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనంతరం బివికె ఆధ్వర్యంలోనే జరిగిన 'ఆదివారం మీ కోసం' కార్యక్రమంలో '20 ఏళ్లు సంస్కరణల అనుభవాలు' అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్టడీసర్కిల్‌లో ఆయన ప్రసంగిస్తూ..1991 నుండి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలు దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుదలకు కారణాలయ్యాయని తెలిపారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరిగినప్పటికీ ఉపాధి రహితమైన అభివృద్ధి కారణంగా నిరుద్యోగం, అవినీతి పోటీపడి పెరుగుతున్నాయని విశ్లేషించారు. పేదలు, మధ్య తరగతి వర్గాలపై పన్నులు పెంచిన యుపిఏ ప్రభుత్వం ఏడేళ్లలో బడా పెట్టుబడిదారులకు 15 లక్షల కోట్ల రాయితీలివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మధ్య పోటీ వైరుధ్యాలు ఉండేవని, ప్రస్తుతం వారంతా కుమ్మక్కయి దేశ సంపదను ఊడ్చి పారేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం ఒక సంక్షోభంలో నుండి మరో సంక్షోభంలోకి నెట్టబడుతోందన్నారు.

అమెరికా ఫైనాన్స్‌ సంక్షోభం ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదముంద న్నారు. సంక్షేమానికి కోతలు విధించిన ఫలితంగా ప్రజా పోరాటాలు వెల్లువగా వస్తున్నాయని వివరించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 'మార్క్సిస్ట్‌' సైద్ధాంతిక బులెటిన్‌ సంపాదకులు ఎస్‌.వెంకట్రావ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ టి.ఎల్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సంస్కరణల ఫలితంగానే ఆర్థిక అసమానతలు
రెండు దశాబ్దాల సంస్కరణల అమలు ఫలితంగానే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని 'ఆదివారం మీకోసం'లో కార్యాక్రమంలో శ్రీనివాసరావు అన్నారు. సంపద కొద్ది మంది చేతిల్లో కేంద్రీకృతమైందన్నారు. ఆర్థిక సంస్కరణలన్నీ టాటా, బిర్లా వంటి బడాబాబులకే ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. కొత్తగా బిలినియర్లు తయారయ్యారని, పేదరికం మరింత పెరిగిందని చెప్పారు. యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన కమిటీ లెక్కల ప్రకారమే దేశంలో ఒక పూటా తినడానికి లేని వారి సంఖ్య 55 శాతంగా ఉందన్నారు. సంస్కరణల వల్ల అభివృద్ధి చెందుతోందున్నది రైతులా, కూలీలా, సంపన్న వర్గాలా అన్నది పాలకులు స్పష్టం చేయాలన్నారు. అసమానతలు పెరగడానికి ప్రధాన కారణం సంస్కరణలేనన్నారు. వీటి ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో దళితులు ఒకరన్నారు. ప్రభుత్వ రంగం ప్రయివేటు పరం కావడంతో రాజ్యాంగ పరంగా వారికి ఉద్యోగాల్లో రావాల్సిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు రాజకీయాలను శాసిస్తున్నారన్నారు. రాజకీయా ల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని విమర్శించారు. నష్టపోయిన వర్గాలను సమీకరించి సంస్కరణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సదస్సుకు 'ఆదివారం మీ కోసం' కార్యక్రమ అధ్యక్షులు జోసెఫ్‌ అధ్యక్షత వహించారు.
నాలుగేళ్లు- 200 వారాలు పూర్తి చేసుకున్న స్టడీ సర్కిల్‌
ఖమ్మం జిల్లా కేంద్రంలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బివికె) ఆధ్వర్యంలో బహుముఖ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రాజకీయ, సిద్ధాంత చైతన్యాన్ని కలిగించడానికి స్టడీ సర్కిల్‌ నిర్వహిస్తున్నారు. ఇది నాలుగేళ్లు, 200 వారాలను పూర్తి చేసుకుంది. 201వ వారాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో వి.శ్రీనివాస రావు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆయన విశ్లేషించారు. తమ్మినేని వీరభద్రం సమన్వయకర్తగా వ్యవహరిస్తు న్నారు. ప్రారంభంలో ఆరుగురితో మొదలై 60 మందికి చేరింది. ప్రతి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మొదట గంటన్నరపాటు మూడు ప్రత్యేక సమస్యలపై ముగ్గురు మాట్లాడతారు. మరో గంట సేపు సబ్జెక్ట్‌ బోధిస్తారు. 9 గంటలకు టిఫిన్‌ బ్రేక్‌ ఉంటుంది. వెంట నే ప్రారంభమయ్యే చర్చలో సభ్యులంతా పాల్గొంటారు. సిలబస్‌ ముందే చెప్పడం వల్ల సభ్యులంతా అధ్యయనం చేసి వస్తారు. ఇప్పటివరకు గతితర్కం, చారిత్రక భౌతికవాదం, చరిత్రలో సైన్స్‌, భారతదేశ చరిత్ర, ప్రపంచ ప్రజల చరిత్ర, సామ్రాజ్యవాదం, భారతీయ తత్వశాస్త్రం, భారతదేశ అర్థిక వ్యవస్థ-పరిణామం అనే ఎనిమిది గ్రంథాలపై బోధన, చర్చ జరిగింది. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు సందర్భంలోనూ వాయిదా పడకుండా నిరవధికంగా స్టడీసర్కిల్‌ సాగింది. ఇందులో ఉన్నత పాఠశాల స్థాయి నుండి జెఎన్‌యులో పిహెచ్‌డి చేసిన స్థాయి వరకు పాల్గొంటున్నారు. అనేక మంది కొత్తగా రాజకీయ, సిద్ధాంత, సైన్స్‌, ఆర్థిక శాస్త్రాలను బోధించగలుగు తున్నారు. వ్యాసాలు, నోట్స్‌ రాయగలుగుతున్నారు. ఇప్పటివరకు 22 జిల్లాల నుండి వచ్చిన వారు ఈ స్టడీసర్కిల్‌ను పరిశీలించి వెళ్లారు. ఖమ్మం స్టడీ సర్కిల్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 150 స్టడీసర్కిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పది నియోజకవర్గాలలో ప్రతివారం, 46 మండలాలలో ప్రతి 15 రోజులకొక స్టడీసర్కిల్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం స్టడీసర్కిల్స్‌ అనుభవాలతో, రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా స్టడీసర్కిల్స్‌ను విస్తరింపచేస్తున్నామని, సిద్ధాంత అధ్యయనం ప్రాథాన్యతను సిపిఎం కేంద్ర కమిటీ గుర్తించిందని పరిశీలకుడిగా వచ్చిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్‌.వెంకట్రావ్‌ మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్‌ ప్రభావంతో మార్కిస్ట్‌ ఐదు వేల నుండి 30 వేల సర్క్యులేషన్‌ పెరిగిందన్నారు. అధ్యయనం పెరుగుదలకు స్టడీసర్కిల్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Thursday, August 4, 2011

భూ కేటాయింపులన్నింటిపైనా సిబిఐతో సమగ్ర విచారణ

  • 14 ఎఫ్‌పై చిదంబరానిది డొంకతిరుగుడు
  • డిఎల్‌కు చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు బయటపెట్టాలి : సిపిఐ(ఎం) 
కేవలం శాసనసభలో చర్చ జరిగిన వాటిపైనే కాకుండా వైఎస్‌ హయాంలో జరిగిన మొత్తం భూ కేటాయింపులన్నింటిపైనా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ హయాంలో జరిగిన కేటాయింపులతోనూ, అక్రమాలతోనూ కేబినెట్‌కు ఎలాంటి సంబంధమూ లేదంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో... గతంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వాటికిచ్చిన రాయితీలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడే భూ కేటాయింపులు, సంస్థల్లో పెట్టుబడులు, ప్రభుత్వమిచ్చిన రాయితీలకు సంబంధించిన లింక్‌ బయటపడుతుందని స్పష్టంచేశారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించామన్నారు. రాజ్యాంగపరంగానూ, చట్టబద్ధంగానూ జరిగిన విషయాలకు సిఎంతో సహా కేబినెట్‌లోని సభ్యులందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందనే నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు కొత్త తర్కం చెబుతున్నారని అన్నారు. వారు చెబుతున్నదే నిజమైతే కేంద్రంలోని ప్రధానికి కూడా ఇది వర్తించాలి కదా? అని ప్రశ్నించారు. అలా ఐతే 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి రాజాను కాకుండా ప్రధానమంత్రిని జైల్లో పెట్టాలి కదా? అని ప్రశ్నించారు. అందువల్ల వైఎస్‌ హయాంలోని కేబినెట్‌ నిర్ణయాలన్నింటినీ వెల్లడించి వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడిస్తున్నారన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్‌ సంస్థల్లో కంపెనీల పెట్టుబడులు, ప్రభుత్వం ఆయా కంపెనీలకిచ్చిన రాయితీలకు సంబంధించి ఆనాటి సిఎందే పూర్తి బాధ్యతంటూ వారు చెబుతున్నారని గుర్తుచేశారు. వీటితో కేబినెట్‌కు ఎలాంటి సంబంధమూ, బాధ్యతా లేదంటూ వారు వాదిస్తున్నారని అన్నారు. అయితే ఏలినవారికిష్టమైనవారికి, దగ్గరివారికి వేలవేల ఎకరాలను కట్టబెట్టిన విషయాన్ని సిపిఎం ఏనాడో బట్టబయలు చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కేవలం శాసనసభలో చర్చ జరిగిన అంశాలపైనే విచారణ జరిపిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. అయినా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఇప్పుడు హై కోర్టు జోక్యంతో సిబిఐ విచారణ జరుపుతోందని చెప్పారు.
14 (ఎఫ్‌)ను తొలగించాలంటూ గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగీవ్ర తీర్మానం చేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మరోసారి తీర్మానం చేయాలని కేంద్ర మంత్రి చిదంబరం డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని రాఘవులు విమర్శించారు. ఈ అంశంపై మరోసారి పేచీ పెట్టేందుకే ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ మరోసారి ఎందుకు తీర్మానం చేయాలో చెప్పకుండా, గతంలో చేసిన తీర్మానంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించకుండా మళ్ళీ తీర్మానం చేయాలంటూ కోరటమేంటని ప్రశ్నించారు. ఈ ఆలస్యానికి బాధ్యత కేంద్రానిది కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 14 (ఎఫ్‌)ను తొలగించేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని, ఈ క్లాజును తొలగించిన తర్వాతే ఎస్సై రాత పరీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని రాఘవులు చెప్పారు. విజయవాడలో టైఫాయిడ్‌, విశాఖ మన్యం ప్రాంతంలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో 20 వైద్య శిబిరాలను నిర్వహిస్తే, ఒక్కోచోట 800 నుండి 900 మంది వరకు రోగులొచ్చారని తెలిపారు. సంక్షేమ గృహాల్లోని విద్యార్థినీ, విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని గుర్తుచేశారు. వీరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడంలేదని విమర్శించారు. వైద్యఆరోగ్యశాఖలోని ట్రాన్స్‌ఫర్లు, నియామకాలకు సంబంధించి తనకే అర్థంకాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అంత అర్థంకానప్పుడు ఆ శాఖలో ఉండటం దేనికని ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని చర్యలు చేపట్టిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించారని అన్నారు. మంత్రి డిఎల్‌ తనశాఖ గురించి మాట్లాడాలంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి అసలు విషయాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో అత్యవసర వైద్య సేవల్ని అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని, అధికారులను సమావేశపరచాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం పట్ణణ సంస్కరణలు, ఆస్తిపన్ను పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఆందోళనలను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులుంటే వారిలో కేవలం ఆరు లక్షల మందికే కార్డులను పంపిణీ చేశారని చెప్పారు. వాటిని తీసుకుని రైతులు బ్యాంకులకెళ్తే రుణాలివ్వడంలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాఘవులు చెప్పారు.