Sunday, October 2, 2011

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు ప్రత్యేక పథకం


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 8 శాతం మొత్తం 26 శాతం నిధులను కేటాయించాలని కోరారు. సబ్‌ప్లాన్‌ నిధుల దారిమళ్లింపు, కోతలు విధించడం సరికాదన్నారు. సబ్‌ప్లాన్‌ అమలు చేయని శాఖలు, అధికారులు, ప్రభుత్వాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్‌ప్లాన్‌ పటిష్ట అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ), సిపిఐ(ఎంఎల్‌), ఎంసిపిఐ(యు), సిపిఐఎంఎల్‌(లిబరేషన్‌), సిపిఐఎంఎల్‌, ఎంఎల్‌ కమిటీ, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరుతెన్నులపై శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ(ఎంఎల్‌) నేత గుర్రం విజరుకుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. 'ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధులను ఖర్చు చేయాలని, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలను నోడల్‌ ఏజెన్సీలుగా నియమించాలని, ఖర్చు చేయని నిధులను వచ్చే బడ్జెట్‌లో కలిపి అదనంగా కేటాయించాలని, కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు వచ్చే నిధులు, ఆదాయాల్లో స్థానిక జనాభా ప్రాతిపదికన సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో నోడల్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలని, జనరల్‌ బడ్జెట్‌లో వీరికి కేటాయింపులు కొనసాగాలని, సబ్‌ప్లాన్‌ ప్రకారం 26 శాతం ఖర్చు పెట్టాలని, ఖర్చు చేయని వారిని శిక్షార్హులను చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు భూమి పంచాలని' రాష్ట్ర సదస్సు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
విశాల ఐక్య ఉద్యమం కావాలి : రాఘవులు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సక్రమంగా అమలు జరగాలంటే విశాల ఐక్య ఉద్యమం కావాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడినట్లు అని అన్నారు. కానీ పాలకులు బంజారాహిల్స్‌ను అభివృద్ధి చేసి, దానినే అభివృద్ధిగా చూపిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని మురికివాడల్లో మంచినీరు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, మరుగుదొడ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. కనీస సౌకర్యాల్లేక దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయని తెలిపారు. పోషకాహారం లేక, వైద్యసదుపాయం లేక ఎస్సీ, ఎస్టీలు బాధపడుతున్నారని వివరించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి చాలా కీలకమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై సామాజిక వివక్షతోపాటు, ప్రభుత్వం అభివృద్ధిలోనూ వివక్ష చూపుతోందని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయింపులు తక్కువ, కేటాయించిన దాంట్లో ఖర్చు తక్కువ, ఖర్చు చేసిన దాంట్లో ఆయా వర్గాల ప్రజలు నివాస ప్రాంతాల అభివృద్ధి ఇంకా తక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతున్న తరుణంలో ప్రయివేటురంగం విస్తరించిపోయిందన్నారు. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు వర్తించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్రం ఆహార భద్రత చట్టం తెస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం మంది మాత్రమే దరిద్రులున్నారని గుర్తించిందని తెలిపారు. సబ్సిడీలు, పింఛన్లు, బియ్యం, కిరోసిన్‌, గ్యాస్‌ వంటి కోటా తగ్గించడానికేనని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీనిని సాధించుకోవడానికి విశాల ఐక్య ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దళిత వాడలు, గిరిజన గూడేలు, తండాల అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
చలో అసెంబ్లీకి సిద్ధం కావాలి : నారాయణ
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తారా? లేదా అన్న అంశంపై ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ చెప్పారు. అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని కోరడం ఈ ప్రభుత్వానికే అవమానకరమని అన్నారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్‌, టిడిపి దొందూదొందేనని అని విమర్శించారు. రక్షిత మంచినీరు లేనందు వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని చెప్పారు. తక్షణం ఏజెన్సీ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఎ ప్రాంతాల్లో గత ఐదేళ్ల కాలంలో కేటాయించిన నిధులు, ఖర్చు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. అప్పుడే గిరిజనుల కోసం చేసిన ఖర్చులో అవినీతి, అభివృద్ధి ఎంతో బయటపడుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఓటింగ్‌లో పాల్గొన్న శాతాన్ని బట్టి నిధులు కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను ప్రతిఘటించాలని సూచించారు. సామాజిక ఐక్యతతో రాజకీయ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పోరాటాల ద్వారానే... : రంగన్న
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు జరగాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమని సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ) నాయకులు కె రంగన్న చెప్పారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు భూమిని కూడా పంచాలని డిమాండ్‌ చేశారు. ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకు రూ.32 ఆదాయం వస్తే పేదలు కాదని ప్రణాళికా సంఘం చెప్పడం ప్రపంచబ్యాంకు మెప్పు పొందడానికేనని అన్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు, సబ్సిడీలు తగ్గించడానికే పాలకులు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సిపిఐఎంఎల్‌, ఎంఎల్‌ కమిటీ నాయకులు భూతం వీరన్న, కొల్లిపర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా బలపడినపుడే సామాజికంగా అభివృద్ధి చెందుతారని చెప్పారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆర్‌ఎస్‌పి మురళీధర్‌ దేశ్‌పాండే, జానకి రాములు మాట్లాడుతూ సిపిఎం నేత రాఘవులు దీక్ష చేసిన సమయంలో సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తామని చెప్పిన మంత్రులు ఇంకా అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన హామీని ఉల్లంఘించిన ఆయా మంత్రులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

జాప్యం చేస్తే మరింత క్షీణిస్తుంది

  
  • సత్వర నిర్ణయం తీసుకోండి
  • రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానికి కరత్‌ లేఖ
రాష్ట్రంలోని పరిస్థితులపై ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు,వివిధ తరగతులకు చెందినవారు తమ అభిప్రాయాలను వెల్లడించినందున మళ్లీ పార్టీలతో సంప్రదింపులు చేయవలసిన అవసరం లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలిపారు. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని కరత్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరుతూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితికి సంబంధించి ఆయన శనివారం ప్రధానికి లేఖ రాశారు. ఆందోళనలతో గత మూడు వారాలుగా తెలంగాణా ప్రాంతం స్తంభించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌పై శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక అందజేసి దాదాపు తొమ్మిది నెలలైంది. ఆ నివేదికను పరిశీలించి ఈ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని తాము భావించినట్లు కరత్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ, సమాజంలోని వివిధ సెక్షన్లు శ్రీకృష్ణ కమిటీకి తమ అభిప్రాయాలు అందజేశాయి. అందువల్ల ఈ విషయంలో రాజకీయ పార్టీలతో మళ్ళీ సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. ఎటువంటి జాప్యానికీ తావివ్వకుండా ఈ విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవహారాలపై శుక్రవారం చర్చించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ రాష్ట్రానికి మరో బృందాన్ని పంపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరిన్ని సంప్రదింపులు అవసరమని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఆజాద్‌ కూడా శనివారం చెప్పారు.

Tuesday, September 27, 2011

ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటిత పోరు

  • సిఐటియు సభల్లో జూలకంటి, శర్మ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, శాసనమండలిలో పిడిఎఫ్‌ నేత ఎంవిఎస్‌ శర్మ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సిఐటియు తొమ్మిదో జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం నిర్వహించిన భారీ ప్రదర్శన, బహిరంగ సభల్లో వారు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.రాజారామ్మోహన్‌రారు అధ్యక్షతన జరిగిన సభలో జూలకంటి మాట్లాడుతూ '2జి' కుంభకోణంలో ప్రధాని, హోంమంత్రి పేర్లు విన్పిస్తున్నాయనీ, దేశాన్ని కాపాడాల్సిన వారే కుంభకోణాల్లో ఉంటే ఇక ప్రజాసమస్యలు పరిష్కరించేదెవరనీ ప్రశ్నించారు. యుపిఎ-2, రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చేముందు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించాయనీ, అధికారం చేపట్టాక ఏ ఒక్కటీ అమలు చేయడం లేదనీ విమర్శించారు. యుపిఎ-1 ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో నడవడంతో కేంద్రం ప్రజలపై భారాలు వేసే సాహసం చేయలేదనీ, ప్రస్తుతం పదేపదే భారాలు మోపుతూ అన్ని వర్గాలనూ దివాళా తీయించే విధానాలు అమలు చేస్తోందనీ అన్నారు. ఉన్న ఉద్యోగులకు జిఓ మూడు ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలనీ కోరుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు.
బియ్యానికి 40 కోట్లయితే వ్యాట్‌ వల్ల 4 వేల కోట్ల ఆదాయం
ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ రూపాయికి కిలో బియ్యం పథకం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.40 కోట్ల చొప్పున ఏడాదికి రూ.480 కోట్ల అదనపు భారం పడుతుందనీ, ఇదే సమయంలో ఇటీవల నిత్యావసరాలపై విధించిన వ్యాట్‌ వల్ల నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరిందనీ తెలిపారు. తాజాగా పెంచిన పెట్రోల్‌ ధరల వల్లే రాష్ట్ర ఖజానాకు రూ.వెయ్యి కోట్ల అదనపు ఆదాయం సమకూరిందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3.50 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జిఓ మూడు ప్రకారం వేతనాలు ఇవ్వాలనీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్‌ చేయాలనీ డిమాండ్‌ చేశారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేసేందుకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు సిద్ధంగా ఉన్నారనీ తెలిపారు. సిఐటియు నాయకులు బేబీరాణి మాట్లాడుతూ తణుకులో నిర్వహిస్తున్న సిఐటియు మహాసభలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలిపారు. ఇటీవల ప్రణాళికాసంఘం రోజుకు రూ.26 ఖర్చు చేసిన వ్యక్తి పేదవాడు కాదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తొలుత స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు.

ప్రజల జీవితాలతో ఆటలా?

  •  
  • ప్రణాళికా సంఘంపై బృందాకరత్‌ ఆగ్రహం
ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని భారత ప్రణాళికా సంఘం అంకెలతోనే కాక ప్రజల జీవితాలతో కూడా ఆటలాడుకుంటోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 32 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 రూపాయలు ఖర్చు పెడితే వారు పేదలు కారని చెబుతూ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికకు ప్రామాణికత ఏమిటని ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు. ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న ధరల్లో 26 రూపాయలతో ఒక వ్యక్తికి ఒకపూట భోజనం కూడా లభించని దుస్థితి నెలకొని ఉన్నట్లు ఆమె గుర్తు చేశారు. ఒక వ్యక్తి పనిచేయాలంటే 2,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ స్థిరీకరించిన ప్రమాణాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌ జిల్లాలో కరువు ప్రభావంతో చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఆదివాసీలు రెండు లేదా మూడు రోజులకోసారి ఒక్కపూట మాత్రమే భోజనం చేసి కాలం గడిపేవారని అనేక నివేదికలు వెల్లడించినట్లు ఆమె పేర్కొన్నారు. మన దేశంలో ఆకలి స్థాయి ఇలా ఉంటే ప్రణాళికా సంఘం మాత్రం దేశవ్యాప్తంగా తన కాకిలెక్కలను రు ద్దుతూ మీరు, మీ పిల్లలు ఒక్కపూట కన్నా ఎక్కువ తింటే మీరు పేదలు కారంటోందని ఆమె విమర్శి ంచారు. పేదరికపు అంచనాలు ప్రభుత్వ విధానాల రూప కల్పన, పర్య వేక్షణకు విస్త్తృత స్థాయి సూచి కలుగా పనికోస్తా యన్నారు.

90వ దశకంలో ప్రజా వ్యతిరేక నయా ఆర్థిక సంస్కరణ విధానాలు అమలులోకి వచ్చే వరకూ అప్పటి ప్రభుత్వాలు ఈ విధానాన్నే అనుసరించినట్లు గుర్తు చేశారు. దేశంలో పేదలను గుర్తించి వారికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కుటుంబాల స్థాయిలో లెక్కలు అవసరమని, అయితే దేశంలో పెరిగిపోతున్న పేదరిక నిర్మూలనా పథకాల ఫలితాలను అధికారికంగా గుర్తించిన పేదలకు మాత్రమే పరిమితం చెయ్యాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆహార సబ్సిడీలు, ఆరోగ్యం, గృహనిర్మాణం, బ్యాంకు రుణాలు, పెన్షన్లు, బాలబాలికలకు సహాయం వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాలు ఇందుకు లక్ష్యంగా మారుతున్నాయని అన్నారు. పేదరికాన్ని అంచనా వేసి, పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రధానమన్న విషయాన్ని ఈ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని ఆమె వివరించారు. అయితే ఈ విధానాలను పక్కనబెట్టి అందుకు బదులుగా పారదర్శకత లేని ఏకపక్ష, మోసపూరిత విధానాలను ప్రణాళికా సంఘం అమలు చేస్తూ పేదరికపు అంచనాలపై కాకిలెక్కలు వేస్తోందని ఆమె విమర్శించారు. గత దశాబ్ద కాలంలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల పేదరికపు అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, తదితర వర్గాల నుంచి పదేపదే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయాన్ని గుర్తించాలని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలో పేదరికపు స్థాయిని వివిధ కమిటీలు 27 శాతం నుంచి 77 శాతం వరకూ అంచనా వేసినట్లు ఆమె గుర్తు చేశారు. అందులో ప్రభుత్వం ఆమోదించిన టెండూల్కర్‌ కమిటీ అంచనాలు తప్పుడు తడకలని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు స్వతంత్రంగా పనిచేసే గ్రామీణాభివృద్ధి శాఖను ప్రణాళికా సంఘానికి అప్పగించారన్న బృందాకరత్‌ రూ.11 వేల వార్షిక ఆదాయ పరిమితితో 1992లో తొలిసారిగా పేదరిక అంచనాల సర్వేను నిర్వహించారన్నారు.దేశంలో 52 శాతం మంది పేదరిక రేఖకు దిగువన ఉన్నారంటూ అప్పట్లో వేసిన అంచనాలను ప్రణాళికా సంఘం తిరస్కరించిందని, అప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామంటూ యుపిఎ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఆహార భద్రతా చట్టం ప్రణాళికా సంఘం పెడుతున్న పరిమితులను చట్టబద్ధం చేయడానికి మాత్రమే పనికొస్తుందని బృందాకరత్‌ ఎద్దేవా చేశారు. ప్రణాళికా సంఘం కాకిలెక్కలను పక్కనబెట్టి చట్టబద్ధమైన ప్రజల డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు కేసు ఒక అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ఆ డిమాండ్‌ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ విస్తరణ కోసం పోరాటంగా మాత్రమే కాక ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, గృహనివాసం, తదితర కనీస అవసరాలను హక్కుగా కల్పించేందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు పన్ను మినహాయింపుల రూపంలో కోట్లాది రూపాయలను పందేరం చేసే ప్రభుత్వం తన ప్రాధాన్యతలను పునర్వ్యవస్థీకరించు కుంటే ఈ డిమాండ్‌ సాకారం అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

Sunday, September 11, 2011

రిలయన్స్‌పై చర్యలు

  • మాజీ డిజిహెచ్‌, ఇతర అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలి
  • నూతన అన్వేషణ అనుమతి విధానాన్ని పునఃసమీక్షించాలి
  • కెజి డి-6 ఉదంతంపై సిపిఎం డిమాండ్‌
   కెజి బేసిన్‌ విషయంలో కాగ్‌ నివేదిక ఆధారంగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిడెట్‌పై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డిమాండ్‌ చేసింది. భూ ఉపరితల, సముద్రాంతర్భాగ (ఆన్‌, ఆఫ్‌షోర్‌) చమురు, సహజవాయు అన్వేషణ కాంట్రాక్ట్‌లకు సంబంధించి కాగ్‌ ఇటీవల వెలువరించిన నివేదిక... ప్రభుత్వ పెద్దలు బడా వ్యాపారులు, వ్యాపార సంస్థలతో కుమ్మక్కయిన తీరును మరోసారి వెలుగులోకి తెచ్చిందని సిపిఎం పేర్కొంది. ఈ వ్యవహారంలో మాజీ డిజిహెచ్‌, ఇతర అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలని, నూతన అన్వేషణ అనుమతి విధానాన్ని పున్ణసమీక్షించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. కెజి డి-6 బ్లాక్‌లో రిలయన్స్‌ పలు అవకతవకలకు పాల్పడడం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక వెల్లడించినట్లు సిపిఎం తెలిపింది. ముఖ్యంగా పెట్రోలియం లాభాలలో సింహభాగాన్ని డిమాండ్‌ చేసేందుకు వీలుగా రిలయన్స్‌ గ్రూప్‌ పెట్టుబడి వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి చూపటం, రిలయన్స్‌ సంస్థ ఇతర ప్రైవేటు సంస్థలకు ఎటువంటి బిడ్డింగ్‌లు లేకుండానే కాంట్రాక్ట్‌లు అప్పగించటం పెట్టుబడి వ్యయం పెరగటానికి దారి తీసిందని కాగ్‌ నివేదిక వెల్లడించిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. కేటాయించిన మొత్తం 7,649 చ.కి.మీ అన్వేషిత ప్రాంతంలో కేవలం ఐదుశాతం తమ ఆధీనంలో ఉంచుకోవటానికి బదులు మొత్తం ప్రాంతాన్నే రిలయన్స్‌ తన ఆధీనంలో ఉంచుకోవటం... ఉత్పాదక పంపిణీ ఒప్పందం(పిఎస్‌సి)కి పూర్తి విరుద్ధమని తెలిపింది.

   ఈ బ్లాక్‌కు అంచనా వేసిన పెట్టుబడి వ్యయం 117 శాతం ఎక్కువగా పెరిగినా, ఉత్పాదక సామర్ధ్యంలో ఏ మాత్రమూ
పెంపుదల లేకపోవటాన్ని కాగ్‌ నివేదిక ఎత్తి చూపిందని తెలిపింది. కేవలం సింగిల్‌ ఫైనాన్షియల్‌ బిడ్ల ఆధారంగా భారీ కొనుగోళ్ల కాంట్రాక్టులను రిలయన్స్‌ దక్కించుకున్న విషయాన్ని కాగ్‌ నివేదిక వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేసింది. దీనివల్ల భారత ప్రభుత్వ పెట్టుబడుల రికవరీకి కూడా భారీగా గండిపడిందని తెలిపింది. 30 కోట్ల డాలర్ల అంచనా వ్యయం ఉన్న కాంట్రాక్ట్‌ను సింగిల్‌ ఫైనాన్షియల్‌ బిడ్‌ ద్వారా 110 కోట్ల డాలర్లకు పదేళ్లకు అకేర్‌ గ్రూప్‌కు కట్టబెట్టటమే ఇందుకు ఉదాహరణ అని, ఇటువంటి పది సింగిల్‌ పార్టీ బిడ్స్‌లో ఎనిమిది కాంట్రాక్ట్‌లను రిలయన్స్‌ గ్రూపు... అకేర్‌ గ్రూప్‌నకు కట్టబెట్టిందని తెలిపింది. దీనిని సాకుగా చూపి పెట్టుబడి వ్యయ అంచనాలను రిలయన్స్‌ గ్రూపు మూడు రెట్లకు పైగా పెంచేసి ఖజానాకు గండికొట్టే ప్రయత్నం చేసిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
కాగ్‌ నివేదికలో వెలుగు చూసిన మరో ప్రధానాంశం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డిజిహెచ్‌) పెట్రోలియం మంత్రిత్వశాఖలు రిలయన్స్‌తో కుమ్మక్కై మొత్తం అన్వేషిత ప్రాంతాన్ని డిస్కవరీ (నిక్షేపాలు కనుగొన్న) ప్రాంతంగా ప్రకటించటం. పిఎస్‌సి నిబంధనల ప్రకారం తొలి దశ అన్వేషణ పూర్తయిన వెంటనే రిలయన్స్‌ మొత్తం అన్వేషిత ప్రాంతంలో 25 శాతం ప్రాంతాన్ని, రెండో దశలో 50 శాతం ప్రాంతాన్ని, మూడో దశలో మొత్తం చమురు బావులను అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా రిలయన్స్‌ గ్రూపు ఈ ప్రాంతాల్లో ఏ మాత్రం ఖాళీ చేయకుండా తిష్టవేసుక్కూర్చుని మొత్తం ప్రాంతాన్ని తన ఆధీనంలో నే ఉంచుకున్నదని, ఇది పిఎస్‌సి నిబంధనలకు విరుద్ధమని పొలిట్‌బ్యూరో వివరించింది.

    భారతదేశం మొత్తం హైడ్రోకార్బన్‌ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేయటమే లక్ష్యంగా రూపొందిన కొత్త అన్వేషిత లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి) ముఖ్యోద్దేశం కాగా ప్రైవేటు సంస్థలు మొత్తం అన్వేషిత ప్రాంతాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకోవటంతో అది నీరుకారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బావుల నుండి ఉత్పత్తి పెరిగే కొద్దీ రాయల్టీలు పెరగాల్సి ఉండగా పెట్రో లాభాలు మాత్రం నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారయ్యాయని కాగ్‌ నివేదిక వెల్లడించిందని పొలిట్‌బ్యూరో వివరించింది. 2009-10లో రూ.5926 కోట్లు ఉన్న లాభాలు, 2010-11 నాటికి రూ.3,610 కోట్లకు పడిపోయిందని తెలిపింది. పిఎస్‌సి నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోనందున ఈ మొత్తం ఒప్పందాలను పున్ణసమీక్షించి సవరించాల్సిన అవసరం ఉందని పొలిట్‌బ్యూరో కేంద్రానికి సూచించింది. ఇదే విధంగా కెయిన్‌ ఎనర్జీ ఆధీనంలోని పన్నాముక్తా చమురు క్షేత్ర నిర్వహణలో కూడా లొసుగులు బయటపడటం ఎన్‌ఇఎల్‌పి అమలుతీరునే ప్రశ్నార్ధకంగా మారుస్తోందని అభిప్రాయపడింది. కాగ్‌ నివేదిక సూచించిన అంశాల ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందానికి విరుద్ధంగా రిలయన్స్‌ తన అధీనంలో ఉంచుకున్న 95 శాతం అన్వేషణ ప్రాంతాన్ని సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవాలని, రిలయన్స్‌పై పెనాల్టీ విధించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మాజీ డిజిహెచ్‌తోపాటు ఈ ఉదంతంతో సంబంధమున్న ఇతర అధికారులను తక్షణమే ప్రాసిక్యూట్‌ చేయాలని, పెట్రోలియం మంత్రిత్వ శాఖ పాత్రనూ విచారించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. ఇలాంటి దుర్వినియోగాలను నివారించడానికి వీలుగా హైడ్రోకార్బన్‌ ఉత్పత్తి పంపిణీ ఒప్పందాల్లో మార్పులు తేవాలని, నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ విధానం (ఎన్‌ఇఎల్‌పి)ని పున్ణసమీక్షించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

గిరిజనుల ప్రాణం నిలబెట్టే కృషి

ప్రభుత్వం తన బాధ్యత విస్మరించడంతో మానవత్వం ఉన్న దాతలు ఇచ్చిన సహకారంతో జన విజ్ఞానవేదిక, గిరిజన సంఘం మన్యం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనుల ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు అన్నారు. శనివారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం విశాఖ మన్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి గిరిజనుల ప్రాణాలను నిలబెట్టాలని కోరారు. ఎన్నికల సమయంలో 'కురు, కురు...' అంటూ 108 సేవల గురించి ప్రచారం చేసి ఓట్లు పొంది, ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. 104 దండగంటూ రూ.200 కోట్లు వృథా అయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి అనడాన్ని విమర్శిస్తూ ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. వీటిని సంస్కరించి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీని కేరళ పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఉపయోగపడే రీతిలో కాకుండా ప్రభుత్వాసుపత్రులు అభివృద్ధి చెందేలా ఆరోగ్యశ్రీని సమగ్ర పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. హెపటైటిస్‌-బి విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, విశాఖ మన్యంలో మలేరియాతో అనేక మంది మరణించారని చెప్పారు. డెంగ్యూ కూడా జిల్లాలో అనేక ప్రాంతాల్లో ప్రబలుతోందన్నారు. దాతలు ఇచ్చిన మందులతో విశాఖ మన్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ సర్జికల్స్‌ అధినేత పి.రఘు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

మత హింస, మైనార్టీల పట్ల వివక్షకు తెరదించే చర్యలను పరిశీలించండి

  • ప్రభుత్వ విధానాల వల్లే యువతలో నిరాశా, నిస్పృహ
  • జాతీయ సమగ్రతా మండలిలో సిపిఎం
దేశంలో నానాటికి పెరిగిపోతున్న మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కులం, మతం ఆధారంగా యువతను వక్రమార్గం పట్టించటం వంటి అంశాలకు తెరదించే చర్యలను పరిశీలించాలని జాతీయ సమగ్రతా మండలి (ఎన్‌ఐసి)కి సిపిఎం సూచించింది. ఈ మేరకు గురువారం ఇక్కడ జరిగిన మండలి సమావేశానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ పలు సూచనలతో కూడిన పత్రాన్ని అందజేశారు. 2008 అక్టోబర్‌లో జరిగిన ఎన్‌ఐసి భేటీ తరువాత మూడేళ్ల విరామం అనంతరం భేటీ అయిన ఎన్‌ఐసి జాతీయ సమగ్రత, మతోన్మాదం వంటి అంశాల పట్ల సమర్ధవంతంగా వ్యవహరించలేకపోతోందని ఆ పత్రంలో పేర్కొన్నారు. మతోన్మాదం, పెరిగిపోతున్న మతోన్మాద హింస, మైనార్టీల పట్ల వివక్ష, కులం, మతం ఆధారంగా యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాల వంటి అంశాలపై ఈ సమావేశంలోనైనా చర్చించి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. మతోన్మాదం సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలతో ముడపడి వున్నదన్న కరత్‌ మతోన్మాదం తగ్గిందని ఎవరైనా వాదిస్తే దానితో తాను ఏకీభవించబోనన్నారు. మతోన్మాదం తగ్గిందన్నా, పెరిగిందన్నా అందుకు ఆ ఏడాది కాలంలో జరిగిన ఘటనలను ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

2009లో మొత్తం 791 మతోన్మాద ఘటనలు జరగ్గా అందులో 119 మంది మరణించారని, 2,342 మందికి పైగా గాయాలపాలయ్యారని కరత్‌ వివరించారు. 2010లో 658 ఘటనలు జరిగి 111 మంది మరణించగా, క్షతగాత్రులైన వారి సంఖ్య 1,971గా నమోదయిందని ఇవి సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ అందచేసిన వివరాలేనని ఆయన తెలిపారు. 2005-09 మధ్య జరిగిన మతోన్మాద హింసాత్మక ఘటనల్లో ఏటా 130 మంది ప్రాణాలు కోల్పోగా 2,200 మందికి పైగా గాయాల పాలయ్యారని ఆయన గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఈ సంఖ్యలో ఒకటి, అరా తగ్గుదల ఉన్నప్పటికీ దీనితోనే సంతృప్తి చెందటానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మతోన్మాదం, మతోన్మాద రాజకీయ ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతుండటం జాతీయ సమైక్యతను దెబ్బతీయటమే కాక మన దేశ లౌకిక ఛత్రాన్ని ఛిద్రం చేస్తుందని కరత్‌ అభిప్రాయపడ్డారు. మతోన్మాదానికి మత ఛాందసవాదం, మతం రంగు పులుముకుంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలు ఆజ్యం పోస్తున్నాయన్నారు. మతోన్మాదం, మత రాజకీయాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరం వుందన్నారు. అయోధ్య అంశంపై 1992లో మొదలైన మతోన్మాద రాజకీయాల విపరిణామాలను అందరం చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయతా వాదం పేరిట జనం మధ్యలోకి వస్తున్న రాజకీయాలు మెజార్టీ మతోన్మాదం తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు.

మైనార్టీ మతోన్మాదం కూడా లౌకిక వాదానికి ప్రమాదకరమేనన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలున్నంత కాలం మతోన్మాదం కొనసాగుతూనే వుంటుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో మతోన్మాద సైద్ధాంతికతను ప్రవేశపెట్టేందుకు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన ఇటువంటి లౌకిక వ్యతిరేక మతోన్మాద సైద్ధాంతికతను కూకటి వేళ్లతో పెకలించివేయాల్సిన అవసరం వుందన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు, మైనార్టీల పట్ల విషం కక్కటం వంటి చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.
ఉగ్రవాదంపై...
భారత్‌లో ఉగ్రవాదం ప్రధానంగా మతపరమైన తీవ్రవాదం, మత విద్వేషాల నుండి పుట్టిందని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదులకు మతం లేదనటంతోనే సరిపోదని, మత తీవ్రవాదం, మతోన్మాదం ఉగ్రవాదానికి బీజాలు వేస్తున్నాయన్న సంగతిని మనం మరువరాదని అన్నారు. మన దేశంలో మతోన్మాదానికి ఉగ్రవాదానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో మత తీవ్రవాదం ఉగ్రవాద హింసకు ఆజ్యం పోస్తోందని ఇందుకు ప్రధానంగా కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు దోహదం చేస్తున్నాయని కరత్‌ వివరించారు. ముంబయి నగరంలో జులైనెలలో జరిగిన పేలుళ్లు, ఢిల్లీ హైకోర్టువద్ద పేలుళ్ల వంటి ఘటనల ద్వారా ఈ సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కరత్‌ తెలిపారు. ఈ సంఘటనల ఆధారంగా కేవలం ఏదో ఒక సెక్షన్‌కు ఉగ్రవాదాన్ని అంటగట్టి వారిని మత సమీకరణకు లక్ష్యంగా చేయటం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. మలేగావ్‌, మక్కా మసీదు, అజ్మీరే షరీఫ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఘటనల వెనుక కొన్ని హిందూత్వ తీవ్రవాద శక్తులున్నాయని దర్యాప్తులో తేలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మతోన్మాదాన్ని, మత తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడే ఉగ్రవాదాన్ని సమర్ధవంతంగా నిర్మూలించగలమని కరత్‌ పునరుద్ఘాటించారు.
మత హింస బిల్లుపై...
మత హింసను సమర్ధవంతంగా ఎదుర్కొని అందుకు పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు విధించే విధంగా పాలనాయంత్రాంగానికి విస్తృతాధికారాలనిచ్చే చట్టం అవసరమని కరత్‌ అభిప్రాయపడ్డారు. ఇటువంటి మతోన్మాద హింసకు బలైన బాధిత కుటుంబాలకు పరిహారాన్ని, పునరావాసాన్ని అందచేసే విధంగా ఈ చట్టం వుండాలన్నారు. మత హింస ఘటనలకు చెక్‌ పెట్టేందుకు పాలనాయంత్రాంగానికి, పోలీసులకు ఈ చట్టం ద్వారా జవాబుదారీ తనాన్ని కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఇది చేసేటప్పుడు రెండు విషయాలను దృష్టిలో వుంచుకోవాలని, ఈ చట్టం కేవలం మతపరమైన హింసపై మాత్రమే దృష్టి పెట్టాలి తప్ప ఇతర రకాలైన హింస, ఘర్షణలపై దృష్టి పెట్టరాదని, అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ, పోలిసింగ్‌ వంటి రాష్ట్రాల ప్రాథమిక బాధ్యతల అంశాల్లో ఈ చట్టం దేశ సమాఖ్య సూత్రాన్ని దృష్టిలో వుంచుకుని అమలు జరగాలని వక్కాణించారు.
మైనార్టీలపై వివక్ష
దేశంలోని మైనార్టీల్లో అధికశాతంగా వున్న ముస్లింలు తీవ్ర అణచివేతకు, వివక్షకు గురవుతున్నారని కరత్‌ తెలిపారు. సచార్‌ కమిటీ నివేదిక ఈ అంశాన్ని సమగ్రంగా వెలుగులోకి తెచ్చిందనీ విద్యా, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఫలాలను అందుకోలేనంత దూరంలో ముస్లిం సమాజం వెనుకబడి వుందని గుర్తు చేశారు. ఈ వెనుకబాటును తొలగించేందుకు సమాన హక్కుల కమిషన్‌ ఏర్పాటు వంటి సచార్‌ కమిటీ చేసిన సూచనలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. సామాజికాభివృద్ధి, వ్యయంలో మైనార్టీలకు తగిన వాటా దక్కేందుకు ఉప ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరంపై సిపిఎం దీర్ఘకాలంగా ప్రభుత్వంతో వాదిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. షెడ్యూల్డు తెగలవారికి తీరని అన్యాయం జరుగుతోందని, ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతోనే వారి ఉనికికి ముప్పు వాటిల్లుతోందని కరత్‌ తెలిపారు. ఇందుకు ఉదాహరణ ప్రభుత్వ మైనింగ్‌ విధానమేనన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మైనింగ్‌ విధానం వల్ల భారీఎత్తున ఆదివాసీలు కూడు, గూడు కోల్పోయి నిర్వాసితులవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భూముల్లో కార్పొరేట్‌ సంస్థలకు మైనింగ్‌ హక్కులు కట్టుబెట్టటం ద్వారా ప్రభుత్వం ఆదివాసీల ప్రాథమిక హక్కులను, జీవనాధారాన్ని కాలరాస్తోందన్నారు.
పౌర ఘర్షణలు...
పౌర ఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం వలసకాలం నాటి చట్టాలనే ఉపయోగిస్తోందని గత ఏడాది జూన్‌లో కాశ్మీర్‌ లోయలో జరిగిన అల్లర్లు, అశాంతి పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని కరత్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వేసవి కాలంలో దాదాపు 120 మంది యువకులు పోలీసులు, భద్రతా దళాల బుల్లెట్లకు బలయ్యారని వివరించారు. ఆగ్రహంతో రాళ్లు రువ్వే యువతను ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు వారిని కాల్చి చంపి మాయం చెయ్యాలన్న విధానాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఈ అమానుషమైన విధానానికి తీవ్రవాదం వంటి అశాంతిని ఎదుర్కొనే విధానాలే మూల కారణమన్నారు. ప్రజా ప్రదర్శనలను, పౌర అశాంతిని సరైన విధంగా ఎదుర్కొనేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందన్నారు. ప్రజా ప్రదర్శనలు, నిరసనల పట్ల పోలీసుల్లో పెరిగిపోతున్న అసహనాన్ని ఇటీవలి కాలంలో గమనిస్తున్నామని, రాజ్యాంగం ప్రసాదించిన సమావేశ హక్కు (రైట్‌ టు అసెంబ్లీ) పూర్తిగా కాలరాయబడిందని ఆయన గుర్తుచేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను నిషేధించేందుకు అధికార యంత్రాంగం, అప్పుడప్పుడూ కోర్టులు విధిస్తున్న నిషేధాజ్ఞల కారణంగా ప్రజాస్వామిక హక్కులు హరింపబడుతున్నాయన్నారు. ఇటీవలి కాలం లోఅవినీతికి వ్యతిరేకంగా జరిగిన శాంతియుత ప్రదర్శ నల ను సైతం పోలీసు బలగాలు ఏ విధంగా అణచివేశాయో మనందరం కళ్లారా చూశామని ఆయన గుర్తు చేశారు. ప్రజా స్వామిక హక్కులను కాలరాయటం, బహిరంగ ప్రదేశాల్లో శాంతి యుత నిరసనలను అడ్డుకోవటం వంటి చర్యలు సామాజిక అశాంతికి ఆజ్యం పోస్తాయని ఆయన హెచ్చరించారు.
యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు...
యువతను సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పుల ఆధారంగా సానుకూల దిశలో మర్చాల్సి వుండగా వారిని మతం, కులం వంటి అంశాల ఆధారంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సామాజికాభివృద్ధికి, లౌకిక, మత సామరస్యానికి హాని చేస్తుందని ఆయన హెచ్చరించారు. యువత తీవ్రవాదం వైపు ఎందుకు మళ్లుతున్నారన్న అంశాన్ని మొదటిగా మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, యువత ప్రాథమిక అవసరాలు తీరకపోవటం వల్లే ఈ అశాంతి పెరుగుతోందని, యువత భవితకు నిరుద్యోగం పెను శాపంగా మారిందని ఆయన అన్నారు. జాతీయ నమూనా సర్వే లెక్కల ప్రకారం ఉపాధి అవకాశాల పెరుగుదల 2000-2005 మధ్య కాలం నాటి 2.7 శాతం నుండి 2005-10 మధ్య కాలానికి 0.8 శాతానికి పడిపోయిందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలపై కోత విధిస్తున్న ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకూ 10,81,336 ఉద్యోగాలు ఖాళీగా పడి వున్నాయన్నారు. ఉపాధి కల్పనలో ఏమీ చేయకుండా మార్కెట్‌ శక్తులే ఉద్యోగాలిస్తాయన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం లభించక నిరాశ, నిస్పృహలకు గురవుతున్న యువత మతోన్మాదం, ప్రాంతీయవాదం, కులం వంటి విభజన శక్తుల ఆకర్షణకు గురవుతున్నదన్నారు. దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక మార్పుల్లో యువతకు భాగస్వామ్యం కల్పించటం ఇప్పుడు పెనుసవాలుగా మారిందన్న కరత్‌ వారికి సరైన అవకాశాలు కల్పించి ఉత్పాదకతలో భాగస్వామ్యం కల్పించటం ద్వారా వారు తమ జీవితాలను సామాజిక న్యాయంతో, గౌరవంతో కొనసాగించగలరన్న విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, విధానాల్లో సమూలమైన మార్పులు రావాలని, ఇటువంటి మార్పులకు యువత తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని కరత్‌ స్పష్టం చేశారు.

Wednesday, August 17, 2011

ప్రజాస్వామ్య హక్కులపై దాడి

అన్నా అరెస్టుకు సిపిఎం ఖండన - నేడు దేశవ్యాప్త నిరసన
            అన్నాహజారే, ఆయన అనుచరుల అరెస్టును, ఢిల్లీలో నిరాహార దీక్షను నిషేధించడం ద్వారా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాతంత్ర హక్కుపై దాడి చేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ చర్యను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కులపై దాడిగా అభివర్ణించింది. ప్రజాతంత్ర హక్కులపై దాడిని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు జరపాల్సిందిగా సిపిఎం తన శాఖలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నతస్థాయి అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయి ఉండగా అవినీతికి వ్యతిరేకంగా జరిగే ఎలాంటి పోరాటం పట్లనైనా కాంగ్రెస్‌ నాయకత్వ అసహన వైఖరిని ఈ చర్య తెలియజేస్తున్నట్లు సిపిఎం పేర్కొంది. ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అధికారిక లోక్‌పాల్‌ బిల్లు బలహీనమైందని, తగిన విధంగా లేదని పునరుద్ఘాటించింది. సమర్థవంతమైన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేలా ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉందని సిపిఎం ఆ ప్రకటనలో పేర్కొంది.

Tuesday, August 16, 2011

సిపిఎం ఆధ్వర్యంలో జమిందారు కబ్జా భూమిలో జెండాలు

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం గణపవరానికి చెందిన జమీందారు బొమ్మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆక్రమణలోని అసైన్డ్‌ భూములను పంచాలని వందలాదిమంది పేదలు సిపిఎం ఆధ్వర్యంలో ఆ భూముల్లో సోమవారం జెండాలు పాతారు. సిపిఎం మైలవరం డివిజన్‌, జి.కొండూరు మండల కమిటీల ఆధ్వర్యంలో సుమారు 250 మంది మహిళలు ఎర్రజెండాలు చేబూని ఆర్‌ఎస్‌ నం.360లోని 17.86 ఎకరాల సీలింగ్‌ భూమిని ఆక్రమించారు. ఈ సందర్భంగా మైలవరం డివిజన్‌ కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ పేదలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే భూస్వాములు, జమీందార్ల ఆక్రమణలోని భూములను స్వాధీనం చేసుకోగలుగుతామని చెప్పారు. 1977లో జమీందారు బొమ్మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సీలింగ్‌ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటూ ఏటా లక్షలాది రూపాయలు గడిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ ఆనాటి నుంచి నేటి వరకూ పొందిన ఆదాయాన్ని రాబట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు ఎస్‌.వి.సారధి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి జమీందారు ఆధీనంలో అసైన్డ్‌ భూములున్నా అధికారులు స్వాధీనం చేసుకోకుండా మిన్నకుండడం బాధాకరమన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి చౌటపల్లి రవి, సిపిఎం జి.కొండూరు మండల కార్యదర్శి బూర్సు శివ పాల్గొన్నారు.

ఆర్థిక సంస్కరణలే అవినీతికి కారణం

  • సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ఆర్‌
20 ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల విష ఫలాల ఫలితమే అంతులేని అవినీతి అని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు అన్నారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికె) ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నిరవధికంగా నడుస్తున్న స్టడీసర్కిల్‌ 200 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుందరయ్యభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనంతరం బివికె ఆధ్వర్యంలోనే జరిగిన 'ఆదివారం మీ కోసం' కార్యక్రమంలో '20 ఏళ్లు సంస్కరణల అనుభవాలు' అనే అంశంపై జరిగిన సదస్సులో కూడా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్టడీసర్కిల్‌లో ఆయన ప్రసంగిస్తూ..1991 నుండి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాలు దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుదలకు కారణాలయ్యాయని తెలిపారు. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరిగినప్పటికీ ఉపాధి రహితమైన అభివృద్ధి కారణంగా నిరుద్యోగం, అవినీతి పోటీపడి పెరుగుతున్నాయని విశ్లేషించారు. పేదలు, మధ్య తరగతి వర్గాలపై పన్నులు పెంచిన యుపిఏ ప్రభుత్వం ఏడేళ్లలో బడా పెట్టుబడిదారులకు 15 లక్షల కోట్ల రాయితీలివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల మధ్య పోటీ వైరుధ్యాలు ఉండేవని, ప్రస్తుతం వారంతా కుమ్మక్కయి దేశ సంపదను ఊడ్చి పారేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం ఒక సంక్షోభంలో నుండి మరో సంక్షోభంలోకి నెట్టబడుతోందన్నారు.

అమెరికా ఫైనాన్స్‌ సంక్షోభం ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదముంద న్నారు. సంక్షేమానికి కోతలు విధించిన ఫలితంగా ప్రజా పోరాటాలు వెల్లువగా వస్తున్నాయని వివరించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 'మార్క్సిస్ట్‌' సైద్ధాంతిక బులెటిన్‌ సంపాదకులు ఎస్‌.వెంకట్రావ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ టి.ఎల్‌ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సంస్కరణల ఫలితంగానే ఆర్థిక అసమానతలు
రెండు దశాబ్దాల సంస్కరణల అమలు ఫలితంగానే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని 'ఆదివారం మీకోసం'లో కార్యాక్రమంలో శ్రీనివాసరావు అన్నారు. సంపద కొద్ది మంది చేతిల్లో కేంద్రీకృతమైందన్నారు. ఆర్థిక సంస్కరణలన్నీ టాటా, బిర్లా వంటి బడాబాబులకే ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. కొత్తగా బిలినియర్లు తయారయ్యారని, పేదరికం మరింత పెరిగిందని చెప్పారు. యుపిఎ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన కమిటీ లెక్కల ప్రకారమే దేశంలో ఒక పూటా తినడానికి లేని వారి సంఖ్య 55 శాతంగా ఉందన్నారు. సంస్కరణల వల్ల అభివృద్ధి చెందుతోందున్నది రైతులా, కూలీలా, సంపన్న వర్గాలా అన్నది పాలకులు స్పష్టం చేయాలన్నారు. అసమానతలు పెరగడానికి ప్రధాన కారణం సంస్కరణలేనన్నారు. వీటి ఫలితంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో దళితులు ఒకరన్నారు. ప్రభుత్వ రంగం ప్రయివేటు పరం కావడంతో రాజ్యాంగ పరంగా వారికి ఉద్యోగాల్లో రావాల్సిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు రాజకీయాలను శాసిస్తున్నారన్నారు. రాజకీయా ల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని విమర్శించారు. నష్టపోయిన వర్గాలను సమీకరించి సంస్కరణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సదస్సుకు 'ఆదివారం మీ కోసం' కార్యక్రమ అధ్యక్షులు జోసెఫ్‌ అధ్యక్షత వహించారు.
నాలుగేళ్లు- 200 వారాలు పూర్తి చేసుకున్న స్టడీ సర్కిల్‌
ఖమ్మం జిల్లా కేంద్రంలో బోడేపూడి విజ్ఞాన కేంద్రం(బివికె) ఆధ్వర్యంలో బహుముఖ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రాజకీయ, సిద్ధాంత చైతన్యాన్ని కలిగించడానికి స్టడీ సర్కిల్‌ నిర్వహిస్తున్నారు. ఇది నాలుగేళ్లు, 200 వారాలను పూర్తి చేసుకుంది. 201వ వారాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో వి.శ్రీనివాస రావు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఆయన విశ్లేషించారు. తమ్మినేని వీరభద్రం సమన్వయకర్తగా వ్యవహరిస్తు న్నారు. ప్రారంభంలో ఆరుగురితో మొదలై 60 మందికి చేరింది. ప్రతి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మొదట గంటన్నరపాటు మూడు ప్రత్యేక సమస్యలపై ముగ్గురు మాట్లాడతారు. మరో గంట సేపు సబ్జెక్ట్‌ బోధిస్తారు. 9 గంటలకు టిఫిన్‌ బ్రేక్‌ ఉంటుంది. వెంట నే ప్రారంభమయ్యే చర్చలో సభ్యులంతా పాల్గొంటారు. సిలబస్‌ ముందే చెప్పడం వల్ల సభ్యులంతా అధ్యయనం చేసి వస్తారు. ఇప్పటివరకు గతితర్కం, చారిత్రక భౌతికవాదం, చరిత్రలో సైన్స్‌, భారతదేశ చరిత్ర, ప్రపంచ ప్రజల చరిత్ర, సామ్రాజ్యవాదం, భారతీయ తత్వశాస్త్రం, భారతదేశ అర్థిక వ్యవస్థ-పరిణామం అనే ఎనిమిది గ్రంథాలపై బోధన, చర్చ జరిగింది. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు సందర్భంలోనూ వాయిదా పడకుండా నిరవధికంగా స్టడీసర్కిల్‌ సాగింది. ఇందులో ఉన్నత పాఠశాల స్థాయి నుండి జెఎన్‌యులో పిహెచ్‌డి చేసిన స్థాయి వరకు పాల్గొంటున్నారు. అనేక మంది కొత్తగా రాజకీయ, సిద్ధాంత, సైన్స్‌, ఆర్థిక శాస్త్రాలను బోధించగలుగు తున్నారు. వ్యాసాలు, నోట్స్‌ రాయగలుగుతున్నారు. ఇప్పటివరకు 22 జిల్లాల నుండి వచ్చిన వారు ఈ స్టడీసర్కిల్‌ను పరిశీలించి వెళ్లారు. ఖమ్మం స్టడీ సర్కిల్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 150 స్టడీసర్కిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పది నియోజకవర్గాలలో ప్రతివారం, 46 మండలాలలో ప్రతి 15 రోజులకొక స్టడీసర్కిల్‌ను నిర్వహిస్తున్నారు. ఖమ్మం స్టడీసర్కిల్స్‌ అనుభవాలతో, రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా స్టడీసర్కిల్స్‌ను విస్తరింపచేస్తున్నామని, సిద్ధాంత అధ్యయనం ప్రాథాన్యతను సిపిఎం కేంద్ర కమిటీ గుర్తించిందని పరిశీలకుడిగా వచ్చిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎస్‌.వెంకట్రావ్‌ మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్‌ ప్రభావంతో మార్కిస్ట్‌ ఐదు వేల నుండి 30 వేల సర్క్యులేషన్‌ పెరిగిందన్నారు. అధ్యయనం పెరుగుదలకు స్టడీసర్కిల్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Thursday, August 4, 2011

భూ కేటాయింపులన్నింటిపైనా సిబిఐతో సమగ్ర విచారణ

  • 14 ఎఫ్‌పై చిదంబరానిది డొంకతిరుగుడు
  • డిఎల్‌కు చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు బయటపెట్టాలి : సిపిఐ(ఎం) 
కేవలం శాసనసభలో చర్చ జరిగిన వాటిపైనే కాకుండా వైఎస్‌ హయాంలో జరిగిన మొత్తం భూ కేటాయింపులన్నింటిపైనా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ హయాంలో జరిగిన కేటాయింపులతోనూ, అక్రమాలతోనూ కేబినెట్‌కు ఎలాంటి సంబంధమూ లేదంటూ కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో... గతంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వాటికిచ్చిన రాయితీలపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడే భూ కేటాయింపులు, సంస్థల్లో పెట్టుబడులు, ప్రభుత్వమిచ్చిన రాయితీలకు సంబంధించిన లింక్‌ బయటపడుతుందని స్పష్టంచేశారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించామన్నారు. రాజ్యాంగపరంగానూ, చట్టబద్ధంగానూ జరిగిన విషయాలకు సిఎంతో సహా కేబినెట్‌లోని సభ్యులందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందనే నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు కొత్త తర్కం చెబుతున్నారని అన్నారు. వారు చెబుతున్నదే నిజమైతే కేంద్రంలోని ప్రధానికి కూడా ఇది వర్తించాలి కదా? అని ప్రశ్నించారు. అలా ఐతే 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి రాజాను కాకుండా ప్రధానమంత్రిని జైల్లో పెట్టాలి కదా? అని ప్రశ్నించారు. అందువల్ల వైఎస్‌ హయాంలోని కేబినెట్‌ నిర్ణయాలన్నింటినీ వెల్లడించి వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడిస్తున్నారన్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, జగన్‌ సంస్థల్లో కంపెనీల పెట్టుబడులు, ప్రభుత్వం ఆయా కంపెనీలకిచ్చిన రాయితీలకు సంబంధించి ఆనాటి సిఎందే పూర్తి బాధ్యతంటూ వారు చెబుతున్నారని గుర్తుచేశారు. వీటితో కేబినెట్‌కు ఎలాంటి సంబంధమూ, బాధ్యతా లేదంటూ వారు వాదిస్తున్నారని అన్నారు. అయితే ఏలినవారికిష్టమైనవారికి, దగ్గరివారికి వేలవేల ఎకరాలను కట్టబెట్టిన విషయాన్ని సిపిఎం ఏనాడో బట్టబయలు చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కేవలం శాసనసభలో చర్చ జరిగిన అంశాలపైనే విచారణ జరిపిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. అయినా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఇప్పుడు హై కోర్టు జోక్యంతో సిబిఐ విచారణ జరుపుతోందని చెప్పారు.
14 (ఎఫ్‌)ను తొలగించాలంటూ గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగీవ్ర తీర్మానం చేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా మరోసారి తీర్మానం చేయాలని కేంద్ర మంత్రి చిదంబరం డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని రాఘవులు విమర్శించారు. ఈ అంశంపై మరోసారి పేచీ పెట్టేందుకే ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ మరోసారి ఎందుకు తీర్మానం చేయాలో చెప్పకుండా, గతంలో చేసిన తీర్మానంపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించకుండా మళ్ళీ తీర్మానం చేయాలంటూ కోరటమేంటని ప్రశ్నించారు. ఈ ఆలస్యానికి బాధ్యత కేంద్రానిది కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 14 (ఎఫ్‌)ను తొలగించేందుకు రాష్ట్రపతికి సిఫారసు చేయాలని, ఈ క్లాజును తొలగించిన తర్వాతే ఎస్సై రాత పరీక్షలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని రాఘవులు చెప్పారు. విజయవాడలో టైఫాయిడ్‌, విశాఖ మన్యం ప్రాంతంలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో 20 వైద్య శిబిరాలను నిర్వహిస్తే, ఒక్కోచోట 800 నుండి 900 మంది వరకు రోగులొచ్చారని తెలిపారు. సంక్షేమ గృహాల్లోని విద్యార్థినీ, విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని గుర్తుచేశారు. వీరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడంలేదని విమర్శించారు. వైద్యఆరోగ్యశాఖలోని ట్రాన్స్‌ఫర్లు, నియామకాలకు సంబంధించి తనకే అర్థంకాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అంత అర్థంకానప్పుడు ఆ శాఖలో ఉండటం దేనికని ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని చర్యలు చేపట్టిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించారని అన్నారు. మంత్రి డిఎల్‌ తనశాఖ గురించి మాట్లాడాలంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి అసలు విషయాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో అత్యవసర వైద్య సేవల్ని అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని, అధికారులను సమావేశపరచాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం పట్ణణ సంస్కరణలు, ఆస్తిపన్ను పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఆందోళనలను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులుంటే వారిలో కేవలం ఆరు లక్షల మందికే కార్డులను పంపిణీ చేశారని చెప్పారు. వాటిని తీసుకుని రైతులు బ్యాంకులకెళ్తే రుణాలివ్వడంలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాఘవులు చెప్పారు.

Sunday, July 31, 2011

నయాఉదారవాద విధానాలకు స్వస్తి పలకాలి

నయా ఉదారవాద ఛీర్‌ లీడర్స్‌ పట్టుదల విస్తుగొలుపుతోంది. వారు తమ స్వీయ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. నాటి ఆర్థిక మంత్రి డాక్టర్‌ మన్హో హన్‌ సింగ్‌ తన తొలి బడ్జెట్‌ సమర్పించి ( 1991 జులై 24) ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరిన్ని సంస్కరణలు ముఖ్యంగా ద్రవ్య సరళీకరణను మరింతగా తీసుకురావాలని అదే పనిగా రొదపెడుతున్నారు. యుపిఏ-1 ప్రభుత్వం పెన్షన్‌ నిధుల ప్రయివేటీకరణ, బీమా రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి పెంపు, విదేశీ బ్యాంకులను మరింత పాత్ర కల్పించేందుకుద్దేశించిన బ్యాంకింగ్‌ సంస్కరణలు, రూపాయికి పూర్తి మారకపు విలువ కల్పించడం వంటి సంస్కరణలను వామపక్షాలు ఆనాడు అడ్డుకోబట్టి సరిపోయింది. లేకుంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం, మాంద్యం దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఉండేది. వారు ఈ విషయాన్ని మరచిపోయినట్లు నటించడమో లేక ఉద్దేశపూర్వకంగానే విస్మరించడమో చేస్తున్నారు.
అత్యంత అట్టహాసంగా సాగిన ఆ బడ్జెట్‌ ప్రసంగం విషయానికి తిరిగొస్తే నయా ఉదారవాద విధానాల వ్యవస్థకు అదొక్కటే భావి సూచిక కాదనే విషయం గుర్తించాలి. ఆ బడ్జెట్‌ సందర్భంగానే రెండు సార్లు భారత రూపాయి విలువ పడిపోయింది. సంస్కరణల ముసుగుతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లాలని రాజీవ్‌ గాంధీ ఇచ్చిన పిలుపు దిగుమతులు భారీ స్థాయిలో పెరిగి విదేశీ మారక ద్రవ్య నిల్వల సంక్షోభానికి దారితీసింది. 1985 నుండి 1989 వరకు 350కి పైగా భారత కార్పొరేట్‌ కంపెనీలకు రు. 5,781 కోట్ల మేరకు విదేశీ మారక ద్రవ్య నష్టం సంభవించింది. దిగుమతులు భారీ స్థాయిలో పెరగడంతో భారత దేశ విదేశీ రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. 1984 -1991 మధ్య భారతదేశ విదేశీ రుణం రు. 28,000 కోట్ల నుండి రు. 1,00,425 కోట్లకు అమాంతంగా పెరిగిపోయింది.
రెండు దశాబ్దాల తరువాత ఆ ఉల్లాసం ఆవిరైపోయి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. రెండు భారతాలను సృష్టించడంలో మనం ఆరితేరాము. ప్రతి ఒక్కరి జీవన శైలి కొంతమేర మెరుగుపడినా, విపరీతంగా పెరిగిపోయిన ఆదాయ అసమానతలు దుర్భర పేదరికానికి కాకపోయినా పేదరికానికి సూచికగా చూడొచ్చు. ఈ విధానాల వల్ల తలెత్తిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం, రైతాంగ ఆత్మహత్యలు , ఆహార ధాన్యాల, పప్పుల తలసరి అందుబాటు గణనీయంగా పడిపోవడం వంటివి మన ప్రజల్లో కొన్ని తరగతుల్లో పెరిగిపోతున్న దారిద్య్రాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఉజ్వల భారతం వెలుగుజిలుగులు ఈ నలిగిపోతున్న భారతాన్ని మరింత దిగజార్చిన ఫలితమే.
ఈ ఉదారవాద పండితులు నయా ఉదారవాద విధానాల అంతర్జాతీయ ఏజెంట్‌ అయిన ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) 2010లో భారత దేశంలో ఒక అధ్యయనం నిర్వహించిందనే విషయాన్ని గుర్తించాలి.' ఇండియా ఈజ్‌ది రైజింగ్‌ టైడ్‌ లిఫ్టింగ్‌ ఆల్‌ బోట్స్‌ ' అన్న శీర్షికతో ప్రచురించిన పత్రం ప్రపంచం అంతటా గుర్తిస్తున్న ఆదాయ అసమానతల సూచి ( దీనినే జినీ కోఎఫిషియంట్‌ అంటున్నారు) ప్రాతిపదికగా భారత దేశంలో పరిస్థితిని విశ్లేషించింది. 21 శతాబ్దం తొలి దశకంలో ఇది దేశం మొత్తం మీద 0.303 నుండి 0.335కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని, ఆ ప్రాంతాల్లో ఈ జినీ కోఎఫిషియంట్‌ 0.343 నుండి 0.378కు పెరిగిందని ఆ పత్రం పేర్కొంది. రెండు భారతాల మధ్య పెరుగుతున్న అంతరాలకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి.
డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను అదే పనిగా పొగుడుతున్నవారు ఆయనను ఆర్థిక మంత్రిగా మొదటి స్థానంలో నియమించిన పిపి నరసింహారావును కొంచెం కూడా తలచుకోవడం లేదు. వాస్తవానికి పివి నరసింహారావు తన ప్రభుత్వ చివరి సంవత్సరంలో సంస్కరణల ప్రక్రియ ప్రజలకు ఆహారం, పని, ఆశ్రయం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక హక్కులను తప్పక కల్పిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదని నిక్కచ్చిగా అంగీకరించారు. 1975 మార్చిలో కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారు. '' నేడు ప్రపంచం చారిత్రిక మలుపులో ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితి నుండి బయటపడేందుకు తంటాలుపడుతున్నది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సఫలం కాలేదు. నేడు లోలకం మరోవైపు తిరుగుతోంది. ఎదురులేని మార్కెట్‌ వ్యవస్థ మాత్రమే కేంద్ర బిందువవుతోంది. మార్కెట్‌ ఆధారిత వ్యవస్థ మాత్రమే అత్యంత ముఖ్యమన్న భావన నుండి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. లేనిపక్షంలో పేదలు, బలహీనవర్గాలు మార్కెట్‌లో నెలకొనే పరిస్థితుల కారణంగా ఒక మూలకు నెట్టివేయబడే అవకాశం ఉంది. ప్రజలను కేంద్ర బిందువులను చేయడంలో వైఫల్యం వల్లే ఈ రెండు వైఖరులు ఆచరణలో విఫలమయ్యాయి. ప్రజలను కేంద్ర బిందువులను చెయ్యడం చాలా ముఖ్యం. నిలకడతో కూడిన మానవ పురోగతిని సాధించేందుకు సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రజల సాధికారిత కేంద్రంగా కలిగిన వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరమెంతైనా ఉంది''.
భారత దేశం గురించి ప్రస్తావిస్తూ నాటి ప్రధాని ఇంకా ఈ విధంగా అన్నారు. '' తగిన వనరులు, వివక్షతకు తావులేని మార్కెట్లు, టెక్నాలజీల అందుబాటు లేకుండా పేదరిక నిర్మూలన, సామాజిక సమగ్రత వంటి కీలక సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. పేద ప్రజలకు హక్కులు కల్పించేందుకు వ్యవస్థ నిర్మాణం, విధానాలు, వ్యూహాల రూపకల్పన, అన్నిటినీ మించి వివిధ పథకాలు, కార్యక్రమాలు ఫలవంతమయ్యేందుకు దోహదం చేసే పర్యవేక్షణ, విశ్లేషణ వంటి పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటుకు అవసరమైన వనరులను సమకూర్చాలి. జాతీయ స్థాయిలో ఇది జరగాలి. నేను పేర్కొన్న హక్కులు విశాల దృక్పథంతో కూడిన అభివృద్ధికి సంబంధించిన మౌలిక హక్కులు మాత్రమే. మార్కెట్‌, రాజ్యంలో చోటుచేసుకునే వికృత పరిణామాలను చక్కదిద్దేందుకు ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు, విజయాలు సాధించేందుకు దోహడం చేస్తాయి. పేదరికాన్ని పారద్రోలాలనే మన లక్ష్యాన్ని సాధించేందుకు మన దేశంలో ప్రస్తుతం అమలుచేస్తున్న సంస్కరణల నేపథ్యంలో ఇటువంటి సమన్వయాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది''.
ప్రజల ఆర్థిక, సామాజిక సాధికారికత ఈ నయా ఉదారవాద వ్యవస్థలో సాధ్యమేనా? ఇటువంటి విధానాల నుండి వైదొలగడం ద్వారా మాత్రమే ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్థి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మొత్తం మీద దీనిని అంగీకరించేందుకు పివి నరసింహారావు నిరాకరించారు. 1996 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఆయన ఈ అంశాలను ప్రస్తావించారన్న విషయం సుస్పష్టం.
ఈ లక్ష్యాలను సాధించాలంటే మన ప్రజలకు ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య కల్పించే నూతన తరహా సంస్కరణలు కావాలి. అంతకంతకూ ప్రబలుతున్న వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడేందుకు కూడా ఇవి అవసరం. అలాగే దేశవ్యాపితంగా భూసేకరణ సందర్భంగా ఉత్పతన్నమైన సమస్యల నుండి ప్రజలను రక్షించాల్సి ఉంది. నయా ఉదారవాద విధానాల అమలు వల్ల సంభవించిన ముఖ్యమైన పరిణామాల్లో ఒకటేమిటంటే పెట్టుబడి పెద్దయెత్తున పోగుపడేందుకు కావాల్సినన్ని నూతన అవకాశాలు ఏర్పడ్డాయి. అటువంటి వాటిలో భూ సేకరణ ఒకటి. రైతుల నుంచి అతి తక్కువ ధరకు భూములను లాక్కొని సూపర్‌ లాభాలు గడిస్తున్నారు. ఈ విధంగా ఆస్తి పోగుపడడాన్ని గురించి అమెరికన్‌ మేధావి ఒకరు నిర్వచిస్తూ పెట్టుబడిదారీ అభివృద్ధి చరిత్రలో ఇది కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం సందర్భంగా జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. ఆ పారిశ్రామిక విప్లవం వల్ల యూరప్‌లో వీధిన పడ్డ వారిలో అయిదు కోట్ల మంది ఐరోపాను వీడి ''స్వేచ్ఛా ప్రపంచం'' (అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు) తరలివెళ్లారు. ఈ రోజు భూములు కోల్పోయి వీధిన పడ్డనిర్వాసితులకు అటువంటి అవకాశాలు లేవు.వీరి పరిస్థితి కడు దుర్భంగా ఉంటుంది. అందుకే కాలం చెల్లిన 1894 నాటి భూ సేకరణ చట్టం స్థానే కొత్త చట్టాన్ని తేవాలని వామపక్షాలు కోరుతున్నాయి. భూములు కోల్పోయినవారికి తగిన పరిహారం చెల్లించడంతోబాటు, భావి ఉపాధి, భూ సేకరణ తరువాత పెరిగిన ఆ భూముల విలువలో మాజీ యజమానికి కూడా తగు వాటా కల్పించడం వంటివి ఈ నూతన చట్టంలో పొందుపరచాలి. ల్యాండ్‌, రియల్‌ ఎస్టేట్‌ మాఫియాలు ఎంతో కొంత నామమాత్రపు ధర చెల్లించి రైతులను బలవంతంగా భూముల నుంచి వెళ్లగొట్టే స్థితి రాకుండా ఈ చట్టం రైతులకు అన్ని విధాలా రక్షణ కల్పించాలి.
ఈ విషయంలో వెనక్కి లాగుతున్న ప్రభుత్వం సమగ్ర ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం అమలుకు తగినన్ని నిధులు లేవని బీద అరుపులు అరుస్తోంది. ఈ అరుపులు అసంబద్ధమైనవే కాదు, మెగా స్కాములకు మూల హేతువైన నయా ఉదారవాద విధానాల దుష్ఫరిణామాలను వక్రీకరించడమే. మన దేశంలో వనరులకు లోటు లేదు. అవినీతిపరులైన రాజకీయనాయకులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ మీడియా కుమ్మక్కయి ఈ వనరులను యథేచ్ఛగా లూటీ చేస్తుంటే వాటిని ఎదుర్కోవాలనే రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే అసలు లోపం.
ఈ సంస్కరణలపై కేంద్రీకరించే బదులు మన ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. కానీ, నేడు మలి విడత సంస్కరణల గురించి మాట్లాడడం ప్రభుత్వానికి ఒక ఫ్యాషనైపోయింది. రిటైల్‌ వ్యాపారంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం గురించి మాట్లాడుతున్నది. ఇదే జరిగితే దేశ వ్యాపితంగా ఈ వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది భారతీయ చిల్లర వర్తకులు వీధిన పడతారు. మనం ప్రస్తావిస్తున్న ఈ సంస్కరణలు సామాజిక, ఆర్థిక సాధికారత సాధించే మాట అలా వుంచి మరింత వినాశనానికే దారితీస్తాయి.
ఈ నయాఉదారవాద విధానాలనుంచి ప్రస్తుత యుపిఏ-2 ప్రభుత్వం పూర్తిగా వైదొలిగేందుకు ప్రజా ఒత్తిడిని పెద్దయెత్తున పెంచాల్సిన అవసరం ఉంది. అసమానతలను పెంచుతూ దేశ వనరులు లూటీకి ఊతమిచ్చే ఈ నయా ఉదారవాద విధానాలే ప్రజలు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను సంతరించుకోవడానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వీటిపై పోరాటాల్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయం

అమెరికా మెప్పు కోసం ఇరాన్‌ చమురును కాలదన్నిన భారత్‌

వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశం అయిన అణు ఒప్పందపు ఉక్కు సంకెళ్లకు బందీ అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యురేనియం శుద్ధి, అణు ఇంధనం రీప్రాసెసింగ్‌ సామర్థ్యం సంతరించుకోవడానికి దోహదం చేసే అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినందుకు ఇరాన్‌ను ఒంటరి చేయడంలో, ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
''అణ్వాయుధాలతోసహా పెద్ద ఎత్తున విధ్వంసానికి దారితీసే ఆయుధాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు చేస్తున్న యత్నాల నుండి ఇరాన్‌ను అడ్డుకునేందుకు, ఆ దేశాన్ని ఒంటరిపాటు చేసేందుకు, అవసరమైతే ఆంక్షలు విధించేందుకు అమెరికా, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్‌ సంపూర్ణంగా , చురుగ్గా సహకరిస్తుందా?లేదా? ఇందుకు సంబంధించి అది నిర్దిష్టంగా చేపట్టిన చర్యలేమిటి అన్నదానిని బట్టి భారత్‌పై ఒక అంచనాకు రావడం జరుగుతుంది''. - (2006 హైడ్‌ ఒప్పందంలోని 104 జి (2), ఇ (1)ను పాటించడంపై వార్షిక సర్టిఫికెట్‌ను అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్‌కు సమర్పించే నివేదిక)
భారత్‌ విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో 12 శాతం మొత్తాన్ని ఇరాన్‌ సమకూరుస్తోంది. ఇరాన్‌ నుండి రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది. గత కొద్ది మాసాలుగా భారత్‌ ఎటువంటి చెల్లింపులు చెయ్యకపోవడంతో చమురు సరఫరా ఆగస్ట్‌ నెలలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్‌ చమురు కంపెనీలకు భారత్‌ ఐదు వందల కోట్ల డాలర్లు బకాయిపడింది. చెల్లింపులు చేసేందుకు ఏర్పాట్లు చెయ్యకపోతే చమురు సరఫరాలను అనివార్యంగా నిలిపివేయాల్సి వస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితి ఎందుకేర్పడింది? ఇరాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా తెచ్చిన ఒత్తిడికి భారత్‌ దాసోహమంది. ఇరాన్‌ చమురు, గ్యాస్‌ పరిశ్రమలను అస్తవ్యస్తం చేసే ఉద్దేశంతో ఇరాన్‌పై అమెరికా 2010 ఆగస్ట్‌లో పలు ఆంక్షలు విధించింది. 1929 తీర్మానం ద్వారా ఇరాన్‌పై భద్రతా మండలి విధించిన ఆంక్షలు 2010 జూన్‌ నాటికి ముగిశాయి. ఇరాన్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో బ్యాంకింగ్‌, విదేశీ మారక లావాదేవీలను నిషేధిస్తూ అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించాయి.
అమెరికా ఒత్తిడికి లొంగడం
భద్రతా మండలి విధించిన ఆంక్షలను మాత్రమే కాకుండా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలను కూడా భారత్‌ పాటిస్తోంది. ఈ ఆంక్షల ఒత్తిడి కారణంగా ఆసియన్‌ క్లియరింగ్‌ యూనియన్‌ (ఎసియు) ద్వారా ఇరాన్‌కు వర్తక సంబంధ చెల్లింపులన్నిటినీ రిజర్వు బ్యాంక్‌ నిలిపివేసింది. ఇరాన్‌కు భారత్‌ దీర్ఘకాలంగా ఈ వ్యవస్థ ద్వారా చెల్లింపులు జరుపుతోంది. ఎసియును నిలిపివేయడంతో చెల్లింపులు ఎలా చెయ్యాలనే సమస్య తలెత్తింది. జర్మన్‌ కేంద్ర బ్యాంక్‌ అయిన బుండెస్‌బ్యాంక్‌ ద్వారా ముడి చమురు దిగుమతులకు చెల్లింపులు జరిపేందుకు భారత్‌, ఇరాన్‌ ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరింది. హాంబర్గ్‌లోని యూరప్‌ ఇరాన్‌ వర్తక బ్యాంక్‌ (ఇఐహెచ్‌)కు బుండెస్‌ బ్యాంక్‌ నగదును బదిలీ చేస్తుంది. ఈ బ్యాంక్‌కు ఎటువంటి ఆంక్షలు వర్తించవు. అయితే కొన్ని వారాల తరువాత అమెరికా, ఇజ్రాయిల్‌ ఒత్తిడిపై జర్మనీ ప్రభుత్వం ఈ లావాదేవీలను నిలిపివేసింది. ఇరాన్‌ చమురు సరఫరాలను కొనసాగించినప్పటికీ భారత్‌ ఎటువంటి చెల్లింపులు చెయ్యలేదు.
భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న రెండవ అతి పెద్ద దేశం ఇరాన్‌. కాగా, సౌదీ అరేబియా అగ్ర స్థానంలో ఉంది. ఇరాన్‌తో చమురు వర్తకం కొనసాగించే విషయంపై కాకుండా ప్రత్యామ్నాయ వనరుల కోసం అన్వేషించే కృషిలో యుపిఏ ప్రభుత్వం ఉంది. ఇరాన్‌ నుండి కాకుండా సౌదీ అరేబియా నుండి చమురును దిగుమతి చేసుకోవాలని భారత్‌కు అమెరికా సూచిస్తోంది.
భారత్‌-అమెరికా మధ్య అణు ఒప్పందం కుదిరినప్పటి నుండి ఇరాన్‌తో భారత్‌ సంప్రదాయసిద్ధమైన సంబంధాలు దెబ్బతినడం ప్రారంభించాయి. భారత్‌ విదేశాంగ విధానం తమ దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉండాలన్న విషయాన్ని అణు ఒప్పందం నిర్ధారించిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌పై ఆంక్షలు విధించడం, దానిని ఒంటరిపాటు చేసే విషయమై భారత్‌ ఏ విధంగా సహకరిస్తోందో అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్‌కు సంవత్సరానికొకసారి నివేదిక సమర్పించాలని హైడ్‌ చట్టం నిర్దేశిస్తోంది. రెండు దేశాల మధ్య అణు సహకారం ఇందుకు అవకాశం కల్పిస్తోంది. జాతీయ సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా భారత విదేశాంగ విధానంలో మార్పులు చేయడాన్ని వామపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
2005 జులైలో భారత్‌- అమెరికా సంయుక్త ప్రకటనపై జార్జి బుష్‌, మన్మోహన్‌ సింగ్‌ సంతకాలు చేసిన కొద్ది వారాల్లోనే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఎఇఎ చేసిన ప్రతిపాదించిన తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటు చేసింది. అలీన దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడమో, ఓటింగ్‌కు గైర్హాజర్‌ కావడమో చేయగా భారత్‌ అమెరికా ఆదేశాలకు అనుగుణంగా తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసింది. 2006 ఫిబ్రవరిలో ఇరాన్‌పై మరోసారి ఐఎఇఎ తీర్మానానికి అనుకూలంగా అది ఓటు చేసింది. హైడ్‌ చట్టంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ సందర్భంగా ఈ విషయాలను అమెరికా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది.
గ్యాస్‌పైప్‌లైన్‌
ఇరాన్‌- పాకిస్తాన్‌- భారత్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ తదుపరి లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ముందడుగు వేయవద్దని అమెరికా పలుమార్లు భారత్‌ను హెచ్చరించింది. భారత్‌ దీనిని తు.చ తప్పకుండా పాటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును నిలిపివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. రెండు సంవత్సరాలకు పైగా వేచి చూసిన ఇరాన్‌, పాకిస్తాన్‌ ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించాయి. పాకిస్తాన్‌ సరిహద్దు వరకు ఈ పైప్‌లైన్‌ను ఇరాన్‌ ప్రస్తుతం నిర్మిస్తోంది.
తుర్క్‌మెనిస్తాన్‌-ఆప్ఘనిస్తాన్‌-పాకిస్తాన్‌- ఇండియా (టిఎపిఐ) పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ దిగుమతి చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. అమెరికా సూచన మేరకే భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఎఇఎలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యడంతో లిక్విఫయిడ్‌ గ్యాస్‌ సరఫరాకు సంబంధించి ఇరు దేశాల మధ్య 25 సంవత్సరాల ఒప్పందం ముగిసింది. ఇరాన్‌లో భారత వాణిజ్య ప్రాజెక్టులు అంచెలంచెలుగా రద్దవుతున్నాయి. అమెరికా బెదిరింపునకు తలవంచి రిలయెన్స్‌ 280 మిలియన్‌ డాలర్ల విలువచేసే గ్యాసోలిన్‌ ఎగుమతులను నిలిపివేసింది. ఇరాన్‌తో ప్రధాన వాణిజ్య సంబంధమైన చమురు ఎగుమతులు దాదాపు అంతరించిపోయే స్థితి నెలకొంది.
అమెరికాకు విజ్ఞప్తి
అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త కనిపించింది. భారత్‌- ఇరాన్‌ మధ్య ఏడు మాసాలుగా నెలకొనిఉన్న చెల్లింపుల సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో ఉందని ఆమెతో కలసి చెన్నరు సందర్శించిన అమెరికా అధికారి పేర్కొన్నట్లుగా ఆ వార్త పేర్కొంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని పెద్దన్న అమెరికాను భారత్‌ వేడుకున్నట్లు ఈ వార్త స్పష్టం చేస్తుంది. ఇరాన్‌ నుండి చమురు సరఫరాలు నిలిచిపోవడానికి అమెరికానే బాధ్యతవహించాల్సి ఉంటుంది. చమురు సరఫరాలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఇటువంటి అక్రమ చర్యలను ప్రతిఘటించాల్సింది పోయి ఇరాన్‌ నుండి చమురును దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని అమెరికాను భారత్‌ దేబిరిస్తోంది.
పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకునేందుకు ఇరాన్‌ను ఒంటరి చెయ్యాలనే అమెరికా లక్ష్యానికి సహకరించడం ద్వారా భారత్‌ తన ప్రయోజనాలను పణంగా పెడుతోంది. అమెరికాకు సన్నిహిత మిత్రపక్షాలైన జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను కొనసాగిస్తూ అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ విధించిన ఆంక్షలకు విరుద్ధంగా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తుండగా భారత ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా అమెరికా లక్ష్యానికి అనుగుణంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. నాటో కూటమిలో భాగస్వామ్య దేశమైన టర్కీ చమురు రంగంలో ఇరాన్‌తో తాజాగా కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకుంది. చైనా కూడా ఇరాన్‌ నుండి చమురు దిగుమతులను అధికం చేసింది. ఇరాన్‌ నుండి చైనా దిగుమతులు జూన్‌లో 53.2 శాతం పెరిగాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకాంశం అయిన అణు ఒప్పందపు ఉక్కు సంకెళ్లకు బందీ అయిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన హైడ్‌ చట్టానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యురేనియం శుద్ధి, అణు ఇంధనం రీప్రాసెసింగ్‌ సామర్థ్యం సంతరించుకోవడానికి దోహదం చేసే అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసినందుకు ఇరాన్‌ను ఒంటరి చేయడంలో, ఆ దేశంపై ఆంక్షలు విధించడంలో అమెరికాకు భారత్‌ పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్‌ను ఒంటరి చేసేందుకు, నిర్దేశిత మార్గం నుండి దారి మళ్లేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు, అవసరమైతే ఆంక్షలు విధించేందుకు, కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భారత్‌ క్రియాశీలక భాగస్వామ్యం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్‌కు వార్షికంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని హైడ్‌ చట్టం నిర్దేశిస్తోంది. ఇతర దేశాల నుండి భారత్‌ ముడి చమురు దిగుమతి చేసుకోవచ్చు. అయితే అమెరికా ముందు సాగిలపడే యుపిఏ ప్రభుత్వ వైఖరి మన దేశ ఆత్మగౌరవాన్ని , దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.
-ప్రకాశ్‌ కరత్‌

మార్క్సిస్ట్ ఆగస్ట్ నెల సంచిక వెలువడుతోంది


Saturday, July 30, 2011

ముదిగొండ అమరుల స్ఫూర్తితో... మళ్లీ భూ పోరాటాలు

ముదిగొండ అమరవీరుల స్థూపం వద్ద నివాళ్ళర్పిస్తున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

ముదిగొండ భూ పోరాట అమరుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో వామపక్షాల ఆధ్వర్యాన సమైక్యంగా, ఉమ్మడిగా భూ పోరా టాలను నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రస్తుతం రైతుసంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిస్‌, గిరిజన సంఘం ఆధ్వర్యాన దళితులు, గిరిజనులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆందోళనలు జరుగు తున్నాయన్నారు. కౌలు రైతుల సమస్యలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, గిరిజన ప్రాంతాల్లో వైద్యం తదితర సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత భూ పోరాటాలకు కార్యాచరణ రూపొంది స్త్తామని తెలిపారు. వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా చేపట్టడానికి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ముదిగొండ భూ పోరాట అమరవీరుల నాలుగో వర్థంతి సభ గురువారం హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సిఐటియు సీనియర్‌ నాయకులు రాజారావు, ప్రజా సంఘాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అమరవీరుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులు, దళి తులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాల వారికోసం ముదిగొండ అమరవీరులు ప్రాణత్యాగం చేశారన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలా లను, భూమి పంచాలంటూ చేసిన పోరాటంలో వారు తమ ప్రాణా లను ఫణంగా పెట్టారని చెప్పారు. ఆ అమరవీరుల ఆశయాలను పూర్తిగా సాధించలేకపోయినప్పటికీ వారి స్ఫూర్తితో దళితులకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు, కౌలు రైతుల రుణార్హత కార్డులు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందజేయ టం తదితర అంశాల్లో పార్టీ, ప్రజా సంఘాలు పూర్తిగా నిమగమై ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీ ఏరియాల్లో వ్యాధుల నివారణకు ప్రభు త్వం చర్యలు చేపడితే పార్టీలు, ప్రజాసంఘాలు సాయం చేయటం సాధారణంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఆయా ప్రాంతాల్లో గిరిజన సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యాన వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారని గుర్తుచేశారు. తీరా గుర్తింపు కార్డులిచ్చిన తర్వాత రుణం కోసం రైతులు బ్యాంకుకెళితే అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కౌలు రైతులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. గిరిజనులు అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు పట్టాలివ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. అటవీ హక్కుల చట్టం అమలుకోసం పోరాడినందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియాలో ఇద్దరు పార్టీ కార్యకర్తలపై పిడి యాక్టు కింద కేసులు పెట్టారని అన్నారు. వారిని విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పారు. చివరికి కోర్టు జోక్యంతో వారు విడుదలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ముదిగొండ అమరుల స్ఫూర్తితో భవిష్యత్తులో వివిధ ప్రజా సమస్యలతోపాటు భూ సమస్యను ముందుకు తీసుకురావాల్సిన అవసరముందని రాఘవులు పిలుపునిచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ దున్నేవాడికే భూమి అనే నినాదంతో వీర తెలంగాణా సాయుధ పోరాట కాలం నుండి నేటి వరకు అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. ఈ పోరాటాల్లో పాల్గొని అనేక మంది పోలీసు తూటాలకు బలయ్యారని తెలిపారు. భూ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. ఉపాధితోపాటు ఆదాయ వనరుకూడా కావటంతో భూ సమస్య అత్యంత కీలకమైందన్నారు. వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలవారి పిల్లలకు ఉపయోగపడే హాస్టళ్లు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను వారికి దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇందులో భాగంగానే వంద మంది పిల్లల కంటే తక్కువగా ఉన్న హాస్టళ్లను మూసేయాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ అంశాలపై ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాలు పోరాడుతున్నాయని, వాటికి సిపిఎం పూర్తి మద్దతునిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రజా సమస్యలపై ఇప్పటికే 11 వామపక్షాల ఆధ్వర్యాన ఆందోళనలు జరుతున్న నేపథ్యంలో...రాబోయే రోజుల్లో ఏయే అంశాలపై ఆందోళనలు నిర్వహించాలనే విషయమై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించేందుకు ఆగస్టు 4న లెఫ్ట్‌ పార్టీలు సమావేశమవుతున్నాయని తెలిపారు. తద్వారా ప్రజా సమస్యలపై పోరాటాల్ని బలోపేతం చేస్తామని చెప్పారు.

Thursday, July 28, 2011

మీ వ్యాఖ్యలు అభ్యంతరకరం

  • చిదంబరానికి రాఘవులు లేఖ
  • సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
మంగళవారం కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీల గురించి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తోంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే గందరగోళం సృష్టించే విధంగా వ్యాఖ్యానించారని భావించాల్సి వస్తోందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే సిపిఐ (ఎం) అభిప్రాయమని తెలిసినప్పటికీ కేంద్ర హోం మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించటం చాలా అభ్యంతరకరమని పేర్కొంటూ చిదంబరానికి బుధవారానికి లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం...
మంగళవారం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పార్టీల గురించి ''ఆంధ్రప్రదేశ్‌ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది. పార్టీలు అన్ని నిలువునా చీలిపోయాయి. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్నీ చీలిపోయాయి. కేవలం ఇద్దరు సభ్యులున్న బిజెపి మాత్రమే, దీనికి మినహాయింపు'' అని మీరు చేసిన వ్యాఖ్య విస్తృతంగా ప్రచారం అయింది. మా పార్టీ వైఖరి మీకు బాగా తెలుసు. ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి మా కేంద్ర కమిటి ఇచ్చిన అభిప్రాయం, మీ సమక్షంలో రెండు సార్లు జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో మా పార్టీ చెప్పిన అభిప్రాయం మీకు తెలుసు. రాష్ట్రం సమైక్యంగా వుండాలన్నది సిపిఐ(ఎం) అభిప్రాయమని మీకు తెలిసి కూడా ఇలా వ్యాఖ్యానించడం చాలా అభ్యంతరకరం. ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి మీరు ఈ రకంగా వ్యాఖ్యానించినట్లు భావించవలసివస్తున్నది. రాష్ట్రంలో ఉన్న అనిశ్చిత పరిస్థితికి పూర్తిగా మీది, కేంద్ర ప్రభుత్వానిది భాధ్యత. శ్రీకృష్ణ కమిటి నివేదిక ఇచ్చి ఏడు నెలలు కావస్తున్నా రాష్ట్ర విభజన, సమైక్యత వివాదాన్ని పరిష్కరించకుండా నానబెడుతూ, కాలయాపన చేస్తూ ప్రస్తుత పరిస్థితికి రాష్ట్ర పార్టీలపై నెపం మోపుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి హాని చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రగతి దశాబ్దాల పాటు వెనకబడిపోయే ప్రమాదం వచ్చింది. పరిపాలన స్థంభించిపోయింది. ప్రజల గోడు పట్టించుకునే నాధుడే లేడు, ఇప్పటికైనా సమయం మించిపోకుండా సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాము''.

Tuesday, July 26, 2011

మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ సిపిఎం నుంచి బహిష్కరణ

ఇబ్రహీంపట్నం మాజీ శాసన సభ్యులు మస్కు నర్సింహను పార్టీ నుండి బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు డివిజన్‌ కమిటీ తెలిపింది. ఆయనను రెండు సంవత్సరాల క్రితమే అన్ని బాధ్యతల నుండి తొలగించినట్లు డివిజన్‌ కమిటీ పేర్కొంది. పార్టీ సభ్యునిగా ఉంటూ సంఘాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాడని కమిటీ పేర్కొంది. పార్టీని అప్రతిష్ట పాలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతారంపేట గ్రామంలో ప్రజలు పోరాడి సాధించుకున్న భూమిని అక్రమంగా తమ బంధువుల పేర రాయించుకున్నాడని డివిజన్‌ కమిటీ పేర్కొంది. కమిటీ పలుమార్లు హెచ్చరించినా తన విధానం మార్చుకోలేదని మండిపడింది. ఎమ్మెల్యే కాకముందు తన ఆస్తులను, ఎమ్మెల్యే అయిన తర్వాత తన ఆస్తులపై సిపిఎం ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారని పేర్కొంది. ఆయనను సరిదిద్దేందుకు పార్టీ ప్రయత్నించినా తన పద్ధతి మార్చుకోలేదంది. పార్టీ ప్రతిష్టను దిగజార్చినందుకే ఆయన్ను బహిష్కరిస్తున్నట్లు కమిటీ తీర్మానించింది.

ఏజెన్సీలో ప్రాణాంతక వ్యాధులు నివారించండి

  • వైద్యశాఖ మంత్రికి సిపిఎం వినతి
  • గిరిజన సంఘం, జెవివి ఆధ్వర్యాన వైద్య శిబిరాలు
  • తగు చర్యలు తీసుకుంటాం : డిఎల్‌ హామీ
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్‌, తదితర ప్రాణాంతక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిపిఎం విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట, తూర్పు గోదావరి, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లా ములుగు, తదితర ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో తగినంత మంది వైద్య సిబ్బంది, మందులు లేకపోవడం వల్ల గిరిజనులు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొంటూ సిపిఎం నేతలు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధు, శాసన సభ్యుడు జూలకంటి రంగారెడ్డి వైద్యశాఖ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డికి సోమవారం సచివాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధుల విజృంభణ హెచ్చు స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో సిపిఎం బృందాలు పర్యటించి పరిస్థితి తీవ్రతను అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు, ముంచంగిపుట్టుల్లో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణ కోసం అంబులెన్సులు, మందులు, వైద్య సిబ్బందితో పాటు ఇతర సహాయ సహకారాలను అందజేయాలంటూ మంత్రిని కోరామన్నారు.

మలేరియా, టైఫాయిడ్‌ నివారణకు తగు చర్యలు తీసుకుంటామని, వైద్య శిబిరాలకు అవసరమైన సాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఏజెన్సీల్లోని పిహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడం వల్ల టైఫాయిడ్‌, మలేరియా వ్యాధులను నిర్ధారించే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ కారణంగా ఆయా వ్యాధుల తీవ్రత తగ్గినట్లు కన్పిస్తోందని చెప్పారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ఏరియాలో 33 పిహెచ్‌సీలుంటే, రెండు నెలల క్రితం 15 పిహెచ్‌సీల్లో వైద్యులను నియమించారని తెలిపారు. వారు ఇతర ప్రాంతాల క్యాంపులకు వెళ్లినప్పుడు రిజిస్టర్‌ నమోదు చేసేవారు కూడా ఉండటం లేదని వివరించారు. పాడేరు ఐటిడిఎ పరిధిలోని 11 ఏజెన్సీ మండలాల్లో మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధి తీవ్రంగా ఉందన్నారు. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రోజుకు 300 మంది జ్వర బాధితులను పరీక్షిస్తే వారిలో 60 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని అన్నారు. అంటువ్యాధుల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత ఇంతలా ఉండేది కాదన్నారు. పెరుగుతున్న జనాభా, వ్యాధుల తీవ్రతను బట్టి మందుల బడ్జెట్‌ను పెంచాల్సింది పోయి క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారని విమర్శించారు. ప్రాణాంతకమైన ఫాల్స్‌ఫామ్‌ (పిఎఫ్‌) మలేరియా విశాఖతోపాటు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో అత్యధికంగా ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత రీత్యా గిరిజన ప్రాంతాల్లో తక్షణం వైద్య సేవలందించేందుకు డిప్యూటేషన్‌పై డాక్టర్లు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందిని నియమించి మందుల సరఫరాను మెరుగుపరచాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. మందుల కొనుగోలుకు నిధుల కొరత లేకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన 758 హైరిస్క్‌ గ్రామాలన్నింటిలోనూ వైద్య శిబిరాలను ప్రత్యేకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పిహెచ్‌సి, సబ్‌సెంటర్లకు వైద్య నిమిత్తం వచ్చే రోగులకు, వారి సహాయకులకు భోజన సదుపాయం కల్పించాలని, రోగుల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చే సిహెచ్‌డబ్ల్యూలకు రవాణా ఖర్చులు చెల్లించాలని మధు, జూలకంటి కోరారు. ఈ అంశాలన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Sunday, July 24, 2011

మార్క్సిస్టు (జులై 2011)

ఉద్యోగుల ఆందోళనలు - రోగుల ఇబ్బందులు పరిష్కరించాలి

- ఉస్మానియా ఆస్పత్రి'పై సిఎంకు జూలకంటి లేఖ

రెండు రోజుల నుండి ఉస్మానియా ఆస్పత్రిలో జరుగుతున్న ఆందోళనల వల్ల రోగులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం ద్వారా రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలోని రేడియాలజీ, ల్యాబెటరీలు, కంప్యూటర్‌ విభాగాల్లో మొత్తం 40 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కింద గత 8 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి నెలకు రూ.3,500 నుండి 5 వేల వరకు మాత్రమే వేతనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చే అరకొరా వేతనాలు కూడా ఆరు నెలకొకసారి చెల్లిస్తున్నారని వివరించారు. గత ఏడు నెలల నుండి జీతాలు చెల్లించకపోవటంతో వివిధ విభాగాల సిబ్బంది ప్రస్తుతం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. జీవోనెం.3 ప్రకారం పెంచిన వేతనాలను సైతం వీరికి చెల్లించటం లేదని పేర్కొన్నారు. కనీసం గాంధీ ఆస్పత్రిలో ఇస్తున్న వేతనాలను కూడా ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌ ఉద్యోగులను రెన్యువల్‌ చేసుకోలేదని, ఆస్పత్రి అధికారులు ఈ విషయంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు రాకపోవటంతో ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, అభద్రతాభావంతో ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. ఆస్పత్రిలో ప్రస్తుతం రేడియోలజీ, ల్యాబ్‌ టెక్నీషియన్లు, కంప్యూటర్‌ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సంవత్సరాల తరబడి పనిచేస్తూ వృత్తినైపుణ్యం, అనుభవం కలిగిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఖాళీ పోస్టుల్లో క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయాలంటూ డిఎమ్‌ఇ అనుమతిస్తూ ఆస్పత్రి అధికారులకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా జూలకంటి గుర్తుచేశారు. అయినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి ఉద్యోగులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయించాలని కోరారు. తద్వారా రోగుల ఇబ్బందులను తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు.

పోరాటాలతోనే అవినీతి అంతం

  • దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలి
  • వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి అంతానికి కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, వాటితోపాటు బలమైన ప్రజా పోరాటాలు నిర్వహించాలని 11 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ మధ్య వెలుగు చూసిన 2జి స్పెక్ట్రమ్‌, కామన్వెల్త్‌ క్రీడలు, ఐపిఎల్‌, ఆదర్శ్‌ హౌసింగ్‌, తదితర కుంభకోణాల ద్వారా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, వారి అనుయాయులకు సంబంధించిన వివిధ కంపెనీలు ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున లూటీ చేశాయని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. తద్వారా దేశానికి, ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని విమర్శించారు. అవినీతి ద్వారా ఆర్జించిన సొమ్ముతో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంటున్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న కొద్దిపాటి హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రజలు అవినీతిపై పోరాడాల్సిన అవసరముందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్‌), సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌బ్లాక్‌, సిపిఐ (ఎంఎల్‌), ఆరెస్పీ, ఎంఎల్‌ కమిటీ, ఎంసిపిఐ (యు), ఎస్‌యుసిఐ (సి) పార్టీల ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అవినీతి వ్యతిరేక సదస్సులు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని తీర్మానించింది.
పాలకులే కారణం : రాఘవులు
దేశ పాలకులే అవినీతికి ప్రధాన కారణమని సదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాట్లాడుతూ చెప్పారు. 1948 నుంచి ఇప్పటి వరకూ దేశంలో సాగిన కుంభకోణాల్లో రూ.900 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఈ అవినీతి సొమ్ములో దాదాపు రూ.71 లక్షల కోట్లు స్విస్‌బ్యాంకులో దాచి పెట్టారని అన్నారు. ఈ విధంగా ఇతర దేశాల్లో దాచిపెట్టిన సొమ్మును దేశానికి ఉపయోగపడకుండా చేస్తున్నారని విమర్శించారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో కొల్లగొట్టబడిన రూ.1,76,000 కోట్లతో దేశంలోని 120 కోట్ల మందికి కిలో బియ్యం రూ.2 చొప్పున ఏడాదిపాటు పంపిణీ చేయొచ్చని చెప్పారు. దేశంలోని పిల్లలందరికీ ఐదేళ్ల పాటు ఉచితంగా దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఆహారం అందజేస్తూ ఉచిత విద్యనందించవచ్చని వివరించారు. రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతి వల్ల కేవలం దేశానికి నష్టం కలగడమేగాక ప్రజాస్వామ్యానికి తీరని విఘాతం కలుగుతోందని చెప్పారు. రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయిలో అవినీతికి తోడు సాధారణ స్థాయి అవినీతి కూడా పెచ్చరిల్లడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మార్వో ఆఫీసుకో, ఒక ఆస్పత్రికో లేక మరో పోలీస్‌ స్టేషన్‌కో వెళ్తే లంచం ఇవ్వందే పని జరగడం లేదన్నారు. దీంతో సాధారణ ప్రజానీకం నానా ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయిలో అవినీతికి పాల్పడిన వారికి చట్టబద్ధంగా శిక్షపడే విధంగా చర్యలుండాలని అన్నారు. ఇదే సమయంలో జనలోక్‌పాల్‌ బిల్లు వస్తే దేశంలో అవినీతి పూర్తిగా అంతమవుతుందని భావించడం సరి కాదని అన్నారు. అవినీతి అంతానికి ఈ బిల్లు ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుందని, దీంతోపాటు బలమైన ప్రజా ఉద్యమాలు అవసరమని చెప్పారు. లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధానిని చేర్చాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఎన్నికల విధానంలో మార్పులు తేవాలని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించి వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రాతినిధ్యాన్ని కల్పించాలని అన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలకు సైతం అవినీతిపై స్పష్టమైన విధానం ఉండాలని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణ కొనసాగు తున్న నేపథ్యంలో తన ఆస్తులపై జరుపుతున్న విచారణను ఆపాలంటూ జగన్‌ సుప్రీంకోర్టుకు వెళ్ళడాన్ని రాఘవులు తప్పుబట్టారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఎవరైనా డిమాండ్‌ చేస్తే విచారణకు తాము సిద్ధమే అంటూ ప్రకటించాల్సింది పోయి సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు..
అవినీతిపై పోరాడే హక్కు లెఫ్ట్‌కే ఉంది : నారాయణ
దేశంలో అవినీతిపై పోరాడే నైతిక హక్కు కేవలం వామపక్షాలకే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విధాన నిర్ణయాల్లోనే రాజకీయ అవినీతి దాగుందని చెప్పారు. ఈ రాజకీయ అవినీతిని నిర్మూలించకుండా మొత్తం అవినీతిని నిర్మూలించలేమని అన్నారు. యుపిఎ-1 హయాంలో ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఉన్నందు వల్ల అనేక ప్రజా వ్యతిరేక, అవినీతికర నిర్ణయాలను నిలువరించగలిగామని చెప్పారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థికమాంద్య ప్రభావం భారతదేశంపై పడలేదంటే దానికి కారణం వామపక్షాలేనని తెలిపారు. అణు ఒప్పందాన్ని లెఫ్ట్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వందల కోట్ల రూపాయలను యుపిఎ-1లోని పెద్దలు వెదజల్లారని విమర్శించారు.
సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమించిన సమయంలో అవినీతిలో కూరుకుపోయిన బూర్జువా పార్టీలు సైతం ఆయనకు మద్దతు పలకడం హాస్యాస్పందంగా ఉందన్నారు. సిపిఐ (ఎంఎల్‌) నాయకులు గుర్రం విజయకుమార్‌ మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల ఫలితంగా అన్ని రంగాల్లో అవినీతి విలయతాండవం చేస్తోందని చెప్పారు. ఈ సదస్సులో ఎన్‌ మూర్తి (సిపిఐ ఎంఎల్‌-లిబరేషన్‌), ఎల్‌ మురళీధర్‌ దేశ్‌పాండే (ఫార్వర్డ్‌బ్లాక్‌), జివి రాఘవులు (సిపిఐ ఎంఎల్‌), జానకిరాములు (ఆరెస్పీ), కొల్లిపర వెంకటేశ్వరరావు (ఎంఎల్‌ కమిటీ), మర్రెడ్డి వెంకటరెడ్డి (ఎంసిపిఐ-యు), సిహెచ్‌ మురహరి (ఎస్‌యుసిఐ-సి) ప్రసంగించారు.

Saturday, July 23, 2011

ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న రైతాంగం


రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటిలో అత్యధిక భాగం సముద్రంపాలవుతున్నది. ఒకచోట వర్షం పడుతున్నప్పుడు మరో ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వుండటం రాష్ట్రంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు బాగాపడి నీరు వృధా అవుతున్నప్పుడు ఆ నీటిని వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లోని చెరువు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. అంతేగాక ఒక పంటకు గ్యారెంటీ కల్పించవచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ జలవనరుల నిర్వహణలో ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నాయి.ప్రాజెక్టులలోని మిగులు జలాలను వినియోగించి చెరువు, కుంటలను నింపడానికి ఆ శాఖ విముఖంగా వుంది. ముఖ్యమంత్రి మొదలు సంబంధిత మంత్రి గతంలో చెప్పినప్పటికీ, ఇరిగేషన్‌ శాఖ దాన్ని పాటించలేదు.
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా నేటికీ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. 2011 ఖరీఫ్‌ పంటల సాగుకు సిద్ధమైన రైతు 13 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల (20-07-2011 నాటికి) విత్తనం వేయని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నేటికి 40 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి వుండగా 30 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వేసిన పంటల్లో వర్షాభావం కారణంగా 50శాతం పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి రెండోసారి ఎరువులు, విత్తనం కొరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువులు, విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. బ్లాక్‌మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేసే పరిస్థితి చిన్న సన్నకారు రైతులకు, కౌల్దారులకు లేదు. రాష్ట్రంలో రైతు కరువులు వరదలతో సహజీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువులు, వరదల నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి పథకాలను రూపొందించలేదు. కనీసం తాత్కాలికంగానైనా కంటెంజెన్సీ పథకాన్ని ప్రకటించి రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ శాఖ చొరవచూపట్లేేదు. ఎంతో కీలకమైన వ్యవసాయ శాఖకు పూర్తి బాధ్యతగల మంత్రి లేకపోవడం శోచనీయం. 2010-11లో 15 జిల్లాల్లో 669 మండలాల్లో 27 లక్షల ఎకరాల్లోని పంటలు అతివృష్టి వల్ల దెబ్బతిని 12 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వమే అంచనా వేసింది. వాస్తవానికి ఈ అంచనాలు ప్రాథమికమైనవే. వాస్తవ అంచనాలు ఇంతకుమించి వుంటాయి. కేంద్రాన్ని రు.9,373 కోట్ల సాయం కోరగా కేవలం రు. 481 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. ప్రధాని స్వయంగా ప్రకటించిన రు. 1000 కోట్లలో సగం మాత్రమే రాష్ట్రానికి చేరింది. రాష్ట్రం మరో రు. 500 కోట్లు తన బడ్జెట్‌నుంచి ఇచ్చింది. జరిగిన నష్టానికి ప్రభుత్వాలు అందించిన సహకారానికి మధ్య హస్తిమశకాంతరం వుంది.
వర్షాభావ పరిస్థితుల గణాంకాల సేకరణ కూడా అశాస్త్రీయంగానేవుంది. 750 మి.మీ. లోపు వర్షపాతం గల ప్రాంతాల్లో 2.5 మి.మీ. వర్షం పడితే వర్షపురోజుగా లెక్కిస్తారు. 750 మి.మీ.కు పైన వర్షపాతంగల ప్రాంతాల్లో 5మి.మీ. వర్షం పడితే వర్షపురోజుగా లెక్కిస్తారు. మాసంలో నిర్ణయించబడిన సాధారణ వర్షపాతం ఒకేరోజు పడి మిగతా రోజుల్లో డ్రైస్పెల్‌ (వర్షాలు లేకపోవడం)గా వున్నప్పటికీ వర్షాలు సక్రమంగా పడినట్లు గుర్తిస్తారు. వాస్తవానికి నెలలో పదిరోజుల తేడాతో మూడుసార్లు వర్షం పడినట్లయితే పంటలు నష్టం వాటిల్లదు. కానీ ఒకేరోజు 10 సెం.మీ. వర్షం పడి ఆ తర్వాత నెల రోజుల వరకు వర్షం పడనప్పటికీ నేటి వాతావరణ పరిస్థితుల జాబితాలో సక్రమంగా వర్షాలు పడినట్లు నమోదు చేస్తారు. ఈ అశాస్త్రీయ పద్ధతిని సవరించి ప్రస్తుత పంటల రక్షణ దృష్ట్యా వర్షాభావ పరిస్థితులను అంచనా వేయాలి. మరో 15 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్‌ మెట్టపంటల సీజన్‌ దాటిపోతుంది. ఇప్పటికే పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం ఖరీఫ్‌ సీజన్‌లో 8.17 లక్షల హెక్టార్లు వేయాల్సివుండగా నేటికి 3.77లక్షల హెక్టార్లు మాత్రమే వేశారు. నూనెగింజలు 17.74 లక్షలు వేయాల్సి వుండగా, 7.05 లక్షల హెక్టార్లు వేశారు. గత సంవత్సరం ఇదేరోజున వేసిన విత్తన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ 15 నుండి జూలై 15లోపు వేసిన పంటలు మాత్రమే మంచి ఫలితాన్నిస్తాయి. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు వేసిన పంటల దిగుబడి 50శాతం తగ్గుతుంది. పెట్టుబడి మాత్రం రెండు సందర్భాల్లో వ్యవసాయ పెట్టుబడిలో మాత్రం మార్పువుండదు. వర్షాభావ పరిస్థితులను సక్రమమైన అంచనా వేసి ఆ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కంటెంజెన్సీ పథకాన్ని (అత్యవసర పథకం) నిర్ణయించి అమలుచేసి రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలి. 1956 నుండి పరిశీలిస్తే వ్యవసాయ శాఖ ఈ ప్రత్యేక పథకాన్ని రచించి అమలుజరిపిన దాఖలాలు లేవు. ఖరీఫ్‌ పథకాన్నే సెప్టెంబర్‌ 30 వరకు అమలుచేస్తున్నారు. 2011-12 సంవత్సరానికి జూలై 1న వ్యవసాయ శాఖ ప్రణాళిక విడుదల చేస్తూ 223 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా ప్రకటించింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయా?
2009-10లో వర్షాభావ పరిస్థితుల వలన 981 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ అందించిన సాయం నామమాత్రంగా కూడాలేదు. గత ఏడు సంవత్సరాలు ప్రకృతివైపరీత్యాల వల్ల జరిగిన నష్టపరిహారం చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని రు. 42,533.49 కోట్లు కోరగా, చేసిన సహాయం 1994.31 కోట్లు మాత్రమే. రాష్ట్ర వ్యవసాయ సాగును పరిశీలిస్తే కరువులు, వరదలు లేని సంవత్సరం లేదంటే అతిశయోక్తి కాదు. కరువులు, వరదల నష్టాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన 28 కమీషన్లు (1956 నుండి ) చేసిన సూచనల్లో ఏఒక్కటీ పాటించలేదు. పైగా, జాతీయ విపత్తుల నివారణా కమిటి ఏర్పాటు చేసి దానికి ఉపాధ్యక్షునిగా రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులొకరు కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ కమీషను వాస్తవ పరిశీలనలు చేసిన దాఖలాల్లేవు. ఆ కమిషన్‌ ప్రకటనలు పత్రికలకే పరిమితమవుతున్నాయి. కేంద్ర బృందాలను ఆహ్వానించడం, వారు సమాచారాన్ని సేకరించుకొని వెళ్ళడం ప్రతియేటా జరుగుతున్న తతంగమే.
వాతావరణం అనుకూలించి పంటలు పండితే ప్రభుత్వం తన విధానాల ఫలితంగా ఉత్పత్తి పెరిగిందని చెప్పుకుంటోంది. వాతావరణం అనుకూలించకపోతే ప్రకృతిపైకి నెట్టివేసి ప్రభుత్వం తన బాధ్యతనుండి తప్పుకొంటున్నది. ప్రకృతివైపరీత్యాలను తట్టుకొనే విత్తనాలను కనుగొని రైతులకు అందించడంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం నూతన పరిశోధనలకు నిధుల కేటాయింపుల కోతపెట్టింది. చివరికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధనా కేంద్రాలన్నీ మూతవేశారు. వేల ఎకరాల విస్తీర్ణంలో గల ''ఇక్రిశాట్‌'' పరిశోధనల ఫలితాలు రాష్ట్ర రైతాంగానికి అందడంలేదు. ఇక్కడ జరుగుతున్న పరిశోధనల ఫలితాలు ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండ దేశాలకు పంపించి లాభాలు గడిస్తున్నారు. నేడు ప్రకృతిలో వస్తున్న మార్పుల ఫలితంగా (గ్లోబల్‌ వార్మింగ్‌) భూమి వేడెక్కి రుతువుల క్రమాన్ని మార్చివేసింది. ధనిక దేశాలు కార్బన్‌డయాక్సైడ్‌ను విపరీతంగా విడుదల చేస్తూ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఆ దేశాలు పేద దేశాలకు కార్బన్‌ రుణాలు (అడవుల పెంపకం) ఇచ్చి అడవులు పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఒత్తిడితెస్తున్నాయి. కానీ, తాము విడుదల చేస్తున్న ప్రమాదకరమైన కలుషితాలను మాత్రం తగ్గించుకోవడానికి నిరాకరిస్తున్నాయి.దీనివల్ల రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. అందుకే దీనిని ధనిక దేశాల పాపం అని చెప్పాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించడానికి తగిన ఏర్పాట్లను మన ప్రభుత్వాలు చేపట్టాలి. కానీ, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం మానేశాయి. ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాలే శిరోధార్యంగా అమలుచేస్తున్నాయి. ఆహార పంటల విస్తీర్ణాన్ని తగ్గించాలని, ధనిక దేశాలనుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలని ఆ దేశాలు తెస్తున్న ఒత్తిడికి తలొగ్గి మన వ్యవసాయ విధానాలను రూపొందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఆహారేతర పంటలు (ప్లాంటేషన్‌ పంటలు) వేశారు. మరో కోటి ఎకరాలు సాగుచేయకుండా బీడు భూములుగా వదిలేశారు. మొత్తం 3.50కోట్ల ఎకరాలు సాగుకు వినియోగంగా వుండగా, యిందులో 50శాతం మాత్రమే పంటలు వేస్తున్నారు. కనీసం ఈ పంటలనైనా కాపాడాలన్న లక్ష్యశుద్ధి ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగ రీత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో వుంది. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. నేడు అభివృద్ధి అయిన టెక్నాలజీని వినియోగించి మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించి పంటలను రక్షించవచ్చు. మేఘమథన టెక్నాలజీని వినియోగించాలంటే సొంత రాడార్లు, విమానాలు వుండాలి. కానీ, రాడార్ల కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తున్నది. కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా వర్షాలు పడకుండా మేఘాలను తరిమివేయడానికి ఈ టెక్నాలజీని వినియోగించారు. చైనాలో ఒలింపిక్స్‌ క్రీడల సందర్భంగా కూడా వర్షాలు రాకుండా నివారించారు. మన రాష్ట్రంలో మేఘమథనం బడ్జెట్‌ కింద కోట్లు ఖర్చుచేస్తున్నా ఫలితం శూన్యం. వర్షం పడుతున్నప్పుడే అందులోనే మేఘమథనం చేశామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ప్రవహిస్తున్న నీటిలో అత్యధిక భాగం సముద్రం పాలవుతున్నది. ఒకచోట వర్షం పడుతున్నప్పుడు మరో ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు వుండటం రాష్ట్రంలో సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు బాగాపడి నీరు వృధా అవుతున్నప్పుడు ఆ నీటిని వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లోని చెరువు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. అంతేగాక ఒక పంటకు హామీ ఇవ్వొచ్చు. రాష్ట్ర నీటిపారుదల శాఖ జలవనరుల నిర్వహణలో ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నాయి. ప్రాజెక్టులలోని మిగులు జలాలను వినియోగించి చెరువు, కుంటలను నింపడానికి ఆ శాఖ విముఖంగా వుంది. ముఖ్యమంత్రి మొదలు సంబంధిత మంత్రి గతంలో చెప్పినప్పటికీ, ఇరిగేషన్‌ శాఖ దాన్ని పాటించలేదు. రాష్ట్రంలోని చెరువులు గొలుసుకట్టుగా వుండడం వల్ల నీరు వృధాకాకుండా రక్షించే చర్యలు చేపట్టవచ్చు. రాష్ట్రంలోని 74వేల చెరువు, కుంటలను మంచినీటి వనరులుగా తీర్చిదిద్దడంలో చిన్న నీటివనరుల శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది. దాదాపు 15వేల చెరువులు నీటిని నిల్వపెట్టగల స్థితిలో లేవు. ప్రపంచబ్యాంకు, జపాన్‌బ్యాంకు ఇచ్చే రుణసాయాన్ని ఉపయోగించి మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల వ్యయ అంచనా పెరుగుతున్నది.
ఇటువంటి వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కంటెంజెన్సీ పథకాన్ని ఏర్పాటుచేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాలను ఆవిష్కరించాలి. వర్షపాత వివరాలను సేకరించే విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించాలి. మేఘమథనం ద్వారా పంటలను రక్షించాలి. ప్రాజెక్టుల నీటిద్వారా చెరువు, కుంటలను నింపి భూగర్భ జలాలను పెంపొందించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కిందగల ఆయకట్టును ఆ శాఖే నిర్వహించాలి. పంటలు నష్టపోయిన రైతాంగానికి రెండోసారి పంటవేయడానికి విత్తనాలు, ఎరువులు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి.
-సారంపల్లి మల్లారెడ్డి

Friday, July 22, 2011

ప్రపంచ ప్రజలు పనిచేస్తుంటే అమెరికా కడుపు నింపుకుంటోంది


  • సంక్షోభం నుండి బయటపడడం సులభం కాదు
  • జాతి వివక్ష కొనసాగుతోంది
  • తన యుఎస్‌ పర్యటన వివరాలను వెల్లడించిన రాఘవులు
ప్రపంచ దేశాలన్నీ పనిచేసిపెడుతుంటే అమెరికా తన కడుపు నింపుకుంటోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. అమెరికాలో తలెత్తిన సంక్షోభం నుండి ఆ దేశం బయటపడటం అంత సులభమేమీ కాదన్న విషయం తమ పర్యటన ద్వారా తెలుసుకున్నామని ఆయన చెప్పారు. అక్కడ జాతి వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. తన వనరులన్నింటినీ ఆదా చేసుకున్న అమెరికా ప్రపంచ సంపదనంతా పోగేసి తమ పౌరుల జీవన ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరించిందనే విషయం అవగతమైందన్నారు. తన 20 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న రాఘవులు గురువారం స్థానిక ఎంబి భవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తన అమెరికా పర్యటన అనుభవాలను పంచుకున్నారు. అమెరికాలో తాను పర్యటించిన వివిధ దర్శనీయ, పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ప్రజల జీవన స్థితిగతులు, ఉద్యోగుల స్థితిగతులు, వివిధ రంగాల్లో పనిచేసే వారి అనుభవాలు, ప్రభుత్వ, ప్రయివేటురంగ సంస్థల పనితీరు, ట్రాఫిక్‌ నిబంధనలు, వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు, చట్టాలు, విద్య, వైద్యరంగాల్లో ప్రజలకందుతున్న సేవలు తదితర అంశాల గురించి విపులీకరించారు. ఆ విశేషాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే...

మనదేశ పౌరులు అమెరికా గొప్ప దేశం అంటూ పొగుడుతుంటారు. ఆ దేశంలోని పౌరుల జీవన ప్రమాణాలతో మన ప్రమాణాలను పోల్చుకుని ఆత్మ నూన్యతకు గురవుతుంటారు. అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు మన దేశంతో పోల్చిచూస్తే చాలా మెరుగైన స్థితిలో ఉన్న మాట వాస్తవమే. అక్కడ అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు కనీస వేతనం గంటకు 8 నుండి 10 డాలర్ల వరకు(ఒక డాలర్‌ 45 రూపాయలతో సమానం) ఉంటుంది. అదే స్కిల్డ్‌ పర్సన్స్‌కు అయితే గంటకు 14 నుండి 39 డాలర్ల వేతనముంటుంది. అంటే 8 గంటల పనివిధానం ప్రకారం అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు రోజుకు గరిష్టంగా రూ. 3,600, స్కిల్డ్‌ పర్సన్‌కు గరిష్టంగా రూ. 6,300 వేతనమిస్తారు. ఇల్లు లేనివారికి ప్రభుత్వమే సామూహిక గృహాల్ని కట్టించి ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ గృహాల్లోకి వెళ్ళేందుకు నిరాకరిస్తే బలవంతంగానైనా వారిని ఆ ఇళ్ళలోకి పంపిస్తారు. ఇళ్ళన్నీ కర్ర, కలపతోనే నిర్మిస్తారు. అందువల్ల ఏ గదిలోనైనా కుళాయి ద్వారా నీటిని లీక్‌ కాకుండా చూసుకోవాలి. శబ్దం చేయకుండా నడవాలి. ఇళ్ళల్లో సిగిరెట్లు తాగితే అవి తగలబడే ప్రమాదముంది కాబట్టి ఆరుబయటే వాటిని కాల్చాలి. గతంలో ఇంటి నిర్మాణానికి ఎలాంటి ముందస్తు చెల్లింపులూ లేకుండా రుణమిచ్చేవారు. ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం 10 శాతం డబ్బును చెల్లిస్తేనే రుణ సదుపాయం కల్పిస్తున్నారు. అమెరికాలో బ్రిటీష్‌ పద్ధతులన్నింటినీ వ్యతిరేకిస్తారు. మన దగ్గర దూరాన్ని కిలోమీటర్ల రూపంలో లెక్కిస్తే అమెరికన్స్‌ మైళ్ళ రూపంలో లెక్కిస్తారు. వాహనాలకు కుడివైపునే స్టీరింగ్‌ ఉంటుంది.

అక్కడి జనాలు రోడ్డుకి కుడివైపునే నడుస్తారు. అమెరికాలో పాఠశాల విధానం చాలా బాగుంది. పన్నెండో తరగతి వరకు అందరికీ ఉచిత విద్యనందిస్తారు. పిల్లలకు తిండి దగ్గర్నుండి పాఠ్య పుస్తకాల వరకూ అన్నీ ఉచితంగా అందిస్తారు. పన్నెండో తరగతి తర్వాత కేవలం ఉపాధిని చూపించే విద్యనే అందిస్తారు. ఇవిగాకుండా ఉన్నత చదువులు చదువుకోవాలంటే మాత్రం డబ్బు వెచ్చించాల్సిందే. ఇది అక్కడి పేదవాడికి పెనుభారంగా మారింది. వైద్యం విషయానికొస్తే ప్రభుత్వ, ప్రయివేటు, ట్రస్టు ఆస్పత్రులన్నీ ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే మాత్రం కచ్చితంగా 'ఆరోగ్య బీమా' చేసుండాల్సిందే. ఈ బీమా చేయించుకోకపోతే ఎంత పేదోడైనా డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిందే. కేవలం మరణం సంభవిస్తుందనుకున్న సమయంలో మాత్రమే బీమా లేనివారికి ఉచిత వైద్యాన్నందిస్తారు. మిగతా అన్ని సమయాల్లోనూ కచ్చితంగా డబ్బు వెచ్చించాల్సిందే. అమెరికా మొత్తం జనాభా 31 కోట్లు. వీరిలో 30 లక్షల మంది ఆరోగ్య బీమా చేయించలేదు. మరోవైపు ఆరోగ్య బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియాన్ని కంపెనీలు ఏడాదికేడాది పెంచేస్తుండటంతో సంపన్నులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఫాస్ట్‌ఫుడ్‌ చాలా చీప్‌. అదే రెస్టారెంట్‌లో అయితే మనం భరించలేనంత ఖరీదుంటుంది. అక్కడి ట్రాఫిక్‌ విధానం చాలా పద్ధతిగా, నిబంధనలు కఠినంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. ఒకవేళ వాహనదారులెవరైనా రెడ్‌ సిగల్‌ను దాటితే 45 డాలర్లు జరిమానాగా విధిస్తారు. ఈ విధంగా మూడుసార్లు జరిగితే వాహనదారుడి లైసెన్సును రద్దు చేస్తారు. అక్కడ వాహనాలకు కూడా బీమా చేయిస్తారు. వాహనదారుడెవరైనా మాటిమాటికీ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రమాదాలు చేస్తుంటే అతని వాహన బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియాన్ని కంపెనీలు పెంచుతాయి. ఇన్ని కఠిన నిబంధనలు ఉన్నందువల్లే అక్కడి పౌరులు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తారు. 'మా దగ్గర జీతాలెక్కువగా ఉంటాయి కాబట్టి అవినీతి తక్కువగా ఉంటుంది' అని అక్కడి పౌరులు చెప్పారు. అయితే ఉన్నతస్థాయిలో అవినీతి ఉన్న విషయాన్ని మేం గుర్తించాం. ఈ విధంగా అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నప్పటికీ వారు కూడా కొన్ని విషయాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జాతి వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. నల్లజాతివారు ఒక దగ్గర, ఆసియన్లు మరో దగ్గర, తెల్లజాతివారు ఇంకో దగ్గర నివసిస్తుంటారు. నల్లజాతివారు లేదా ఆసియన్లు తమ ప్రాంతాల వద్దకొచ్చి నివాసాలేర్పర్చుకుంటే తెల్లజాతివారు ఆ ప్రదేశాలను ఖాళీ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి పౌరులు, ఇతర దేశాల నుండి ఉద్యోగార్థం వెళ్ళిన వారు(వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు) అభద్రతాభావానికి గురవుతున్నారు. ప్రస్తుతం డాలర్‌ ప్రింటింగ్‌ మీదనే ఆధారపడి ఆ దేశం బతుకుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ డాలర్‌ చెలామణిలో ఉండటమే దీనికి కారణం. ఒకవేళ ఇతర దేశాల మీద డాలర్‌ పెత్తనం పడిపోతే అమెరికా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ పనిచేసి పెడుతుంటే... అమెరికా తన కడుపు నింపుకుంటోంది. అమెరికాకు వెళ్ళకముందు మీడియాలో వస్తున్న వార్తలనుబట్టి ఆదేశం ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతుందని భావించాం. ఇప్పుడు ప్రత్యక్షంగా అమెరికాకు వెళ్ళి చూసిన తర్వాత సంక్షోభం నుండి అది గట్టెక్కటం అంత సులభమేమీ కాదనే విషయం స్పష్టమైంది.